Sunday, April 28, 2024

కోడికత్తి శ్రీనుకు ఎట్టకేలకు బెయిల్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఎపి హైకోర్టు ఆదేశాలిచ్చింది. కేసు గురించి మీడియాతో ఎక్కడా మాట్లాడవద్దని నిందితుడికి తెలిపింది. రూ.25 వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని, ప్రతీ ఆదివారం ముమ్మిడివరం పిఎస్‌లో హాజరు కావాలని ఆదేశించింది. 2018, అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై దాడి కేసులో శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయిం చాడు. ఈ పిటిషన్ పై కొద్ది రోజుల క్రితం న్యాయస్థానం విచారణ చేపట్టింది. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని, దీంతో నిందితుడు ఏళ్ల తరబడి జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఓ హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండడం సరికాదని న్యాయస్థానానికి వివరించారు.

వాదనలు విన్న న్యాయస్థానం ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు కావడంపై అతని తల్లి సావిత్రమ్మ, సోదరుడు సంతోషం వ్యక్తం చేశారు. చేయని నేరానికి తన కుమారుడు శిక్ష అనుభవించాడని శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జైలుతో తన కుమారుడి ఆరోగ్యం పాడైపోయిందన్నారు. తమకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని శ్రీనివాస్ సోదరుడు వెల్లడించారు. 2018లో వైసిపి అధినేత జగన్ ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్నారు. సిబిఐ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో కోర్టుకు హాజరుకావాల్సి ఉండేది. దీంతో అక్టోబర్ 25న మధ్యాహ్నం లోపు పాదయాత్ర ముగించుకుని విశాఖ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన జగన్ విఐపి లాంజ్ లోకి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ టీ, కాఫీలు అందించే ఉద్దేశంతో అక్కడి క్యాంటీన్‌లో పని చేస్తున్న శ్రీను కోడికత్తితో ఆయనపై దాడికి పాల్పడ్డాడు. అయితే వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

చిన్న గాయంతో జగన్ బయటపడ్డారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరి వైద్యం తీసుకున్నారు. వైద్యులు ఆయనకు తొమ్మిది కుట్లేసినట్లుగా ప్రకటించారు. జగన్ విజ్ఞప్తిపై ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. కోడికత్తి కేసులో గత ఐదేళ్లుగా నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శీను జైలులోనే మగ్గుతున్నారు. బాధితుడిగా ఉన్న సిఎం జగన్ నిరభ్యంతర పత్రం ఇవ్వాలని, బెయిల్‌కు అడ్డంకులు తొలగించాలని అభ్యర్థించినప్పటికీ సిఎం జగన్ స్పందించ లేదు. దీంతో శ్రీనివాస్ రిమాండ్ ఖైదీగానే జైల్లో ఉండిపోయాడు. పలు దఫాలుగా ఎన్‌ఐఎ కోర్టుల్లో కేసు విచారణ వాయిదా పడుతూ వచ్చింది. గతంలో శీను తల్లి సావిత్రమ్మ సిజెఐకి, రాష్ట్రపతికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోయింది. శ్రీనివాస్‌ను విడుదల చేయాలంటూ అతని తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు ఇటీవల విజయవాడలో నిరాహార దీక్షకు సైతం దిగారు. తన తమ్ముడ్ని అడ్డుపెట్టుకుని జగన్ ఎన్నికల్లో సిఎం అయ్యారని, దళితుడు అనే కారణంతో అందరూ వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడని తల్లి సావిత్రి కన్నీటి పర్యంతమయ్యారు. గత ఐదు సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నాడని, ఎపి సిఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదని వాపోయారు. అయితే, ఆమె ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. తాజాగా, నిందితుడు శ్రీనివాస్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో కుటుంబ సభ్యులు, దళిత, పౌర సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తపర్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News