హిమాచల్ అసెంబ్లీనుంచి ఐదుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
సిమ్లా: బిజెపి సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయకు శుక్రవారం బడ్జెట్ సమావేశాల తొలి రోజు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్ర అసెంబ్లీ కాంప్లెక్స్లో కాంగ్రెస్ సభ్యులు ఆయనను ఘెరావ్ చేశారు. ఈ తోపులాటలో దత్తాత్రేయ కింద పడ్డారు. ఈ ఘటన అనంతరం స్పీకర్ అయిదుగురు కాంగ్సె శాసన సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు రాకుండా వారిని సస్పెండ్ చేశారు. సస్పెండయిన వారిలో కాంగ్రెస్ విపక్ష నేత ముకేశ్ అగ్నిహోత్రితో పాటుగా ఎంఎల్ఎలు సుందర్ సింగ్ ఠాకూర్, సత్పాల్ సింగ్ రైజాదా, వినయ్ కుమార్, హర్షవర్ధన్ చౌహాన్ ఉన్నారు. తొలుత ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలైనాయి. సమావేశాలు మొదలైన వెంటనే విపక్ష కాంగ్రెస్ నేతలు పెద్దపెట్టున ఆందోళనకు దిగారు.
విపక్ష నేత అగ్నిహోత్రి తన సీటులోంచి లేచి నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితుల మధ్య గవర్నర్ తన ప్రసంగంలోని చివరి లైన్ మాత్రమే చదివి వినిపించి ప్రసంగం పూర్తయినట్లుగా భావించాలని కోరారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, స్పీకర్ విపిన్ పర్మార్తో కలిసి బైటికి వస్తుండగా స్పీకర్ చాంబర్ వద్ద ఆయనను అడ్డుకునేందుకు విపక్ష సభ్యులు యత్నించారు. దీంతో తోపులాట జరిగింది. సభ తిరిగి సమావేశం కాగానే గవర్నర్ను ఘెరావ్ చేసిన కాంగ్రెస్ ఎంఎల్ఎలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి సురేశ్ భరద్వాజ సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారు.
ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో కాంగ్రెస్ ఎంఎల్ఎలు తీవ్ర నిరాశ చెందడాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తోందన్నారు. అనంతరం ఐదుగురు కాంగ్రెస్ ఎంఎల్ఎలను మిగతా బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పర్మార్ ప్రకటించారు. అయితే ఆయన ఈ ప్రకటన చేసినప్పుడు కాంగ్రెస్ సభ్యులెవరూ సభలో లేరు. అయితే ప్రతిపక్ష సభ్యులు మాత్రం తాము దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం, రైతుల సమస్యలకు వ్యతిరేకంగా నిరసన తొలియజేస్తున్నామని చెప్పారు.