Tuesday, April 30, 2024

స్థానిక ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలి: ఆర్.కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను 22 శాతం నుంచి 50 శాతినికి పెంచాలనిజాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బిసి భవన్‌లో బిసి యువజన సంఘం రాష్ట్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్ సంస్థలైన సర్పంచ్, ఎంపిటిసి, .జెడ్‌పిటిసి, చైర్మన్లు, వార్డ్ మెంబర్స్, కౌన్సిలర్స్. కార్పొరేటర్ ఎన్నికలలో బిసిలకు జనాభా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.

గత టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో బిసి రిజర్వేషన్‌లు 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారని పేర్కొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో 1993లో విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 శాతం ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లను 34 శాతానికి పెందారని గుర్తు చేశారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం బిసి రిజర్వేషన్లు పెంచాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన దుబారా వ్యయాలు, అక్రమాల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయిదని, పైగా అప్పులు పేరుకుపోయాయని, అన్ని శాఖలలో బకాయిలు పేరుకుపోయాయని, ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మన ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌కు సంబంధంలేని డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా కులాల వారి లెక్కలు సేకరించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని, కులాల వారి లెక్కలు సేకరించి పంచాయతీరాజ్ రిజర్వేషన్లను 50 శాతానికి పెందాలని, కులాల వారి లెక్కలు సేకరించిన తర్వాత విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లు 29 శాతం నుంచి జనాభా ప్రకారం పెంచాలని విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలని, ప్రతీ కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రస్తుత 13 కార్పొరేషన్లకు తోడుగా మరో 40 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బిసి నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, పి. సుధాకర్, కోట్ల శ్రీనివాస్, సంధా గోపాల్, రాజ్ కుమారీ, వెంకట్, భరత్, ఉదయ్, కృష్ణ మూర్తి, రామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News