Tuesday, April 30, 2024

గాజాలో ఇజ్రాయెల్ అధినేత తప్పు చేస్తున్నాడు: బైడెన్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: హమాస్ యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి ఇజ్రాయెల్ తొలిసారి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. “నెతన్యాహు గాజాలో తప్పు చేస్తున్నారు. ఆయన వైఖరిని నేను అంగీకరించను. ఆరు లేదా ఎనిమిది వారాల పాటు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని నేను ఇజ్రాయెలీలను కోరుతున్నాను. ఈ సమయంలో శరణార్ధులలకు ఆహారం, ఔషధాలను సరఫరా చేయొచ్చు” అని ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత వారం జరిగిన డ్రోన్ దాడిలో అమెరికాకు చెందిన ఎన్జీవో సంస్థలో పనిచేస్తున్న ఏడుగురు మరణించారు. ఈ ఘటనపై అమెరికా తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది.

జోర్డాన్, సౌదీ, ఈజిప్ట్ దేశాలు కూడా సహాయం, ఆహారం, పంపేలా నిత్యం వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు బైడెన్ తెలిపారు. వారు కూడా దీనికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గాజాలోని ప్రజలకు ఔషధాలు, ఆహార సరఫరాలో ఎటువంటి రాజీ ఉండదని చెప్పారు. మరోవైపు శ్వేతసౌధం స్పందిస్తూ సంధి కోసం ఇజ్రాయెల్ కొన్ని చర్యలు తీసుకొందని వెల్లడించింది. కానీ హమాస్ వైపు స్పందన మాత్రం అంత ప్రోత్సాహకరంగా లేదని పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ అమెరికా, ఐరాస డిమాండ్ చేసిన విధంగానే గాజా లోకి సరఫరాలను పెంచామని వివరించింది. తాము వీటికి ఎటువంటి ఆటంకాలను సృష్టించడం లేదని తెలిపింది. సోమవారం 468 ట్రక్కులు, మంగళవారం 419 ట్రక్కులు సామగ్రిని తరలించినట్టు చెప్పింది. యుద్ధం మొదలైన నాటికి ఇదే అత్యధికమని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News