Saturday, May 11, 2024

విపక్షాల బెంగళూరు భేటీతో బిజెపి వెన్నులో వణుకు: ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి తాను ఒక్కడిని చాలునంటూ ప్రగల్బాలు పలికిన ప్రధాని మోడీ ఇప్పుడు ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి 30 పార్టీలను కూడగట్టుకోవలసిన అవసరం ఏమొచ్చిందని ఖర్గే ప్రశ్నించారు. బెంగళూరులో జరగనున్న ప్రతిపక్షాల సమావేశానికి బయల్దేరి వెళ్లేముందు ఖర్గే సోమవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడారు.

మంగళవారం జరగనున్న ఎన్‌డిఎ సమావేశం గురించి ఖర్గే ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలన్నీ సంఘఠితం కావడాన్ని చూసి వెన్నలో వణుకుపుట్టిన బిజెపి ఇప్పటికే ముక్కలు చెక్కలైన పార్టీలన్నీ ఒక చోటికి చేర్చడానికి ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలన్నీ చాలా రోజుల నుంచే పార్లమెంట్‌లో సైతం పరస్పర సమన్వయం చేసుకుంటున్నాయని, ఎన్‌డిఎ సమావేశంలో పాల్గొననున్న 30 రాజకీయ పార్టీల గురించి తాను ఇదివరకు ఎన్నడూ వినలేదని ఖర్గే చెప్పారు.

ప్రధాని మోడీ రాజ్యసభలో మాట్లాడుతూ యావత్ ప్రతిపక్షాల కోసం తాను ఒక్కడిని చాలునంటూ ప్రకటించారని, ఇప్పుడు 30 పార్టీలను ఎందుకు కూడగడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అసలు ఈ 30 పార్టీలు ఎక్కడివి..వాటి పేర్లు ఏమిటి..అసలు ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయిన పార్టీలేనా అంటూ ఖర్గే వంగ్యాస్త్రాలు విసిరారు.

ఆర్డినెన్స్ అంశంలో ఆప్‌కు మద్దతు ఇస్తూ తన ఢిల్లీ, పంజాబ్ విభాగాలను కాంగ్రెస్ విస్మరించిందన్న బిజెపి వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ ఇది ఒక వ్యక్తి గురించి తీసుకున్న నిర్ణయం కాదని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు తీసుకున్న నిర్ణయమని ఖర్గే తెలిపారు.

తమిళనాడు మంత్రి కె పొన్ముడి నివాసాలపై ఇడి జరిపిన దాడుల గురించి ప్రస్తావిస్తూ ప్రతిపోఆల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు బిజెపి పన్నిన ఎత్తుగడలుగా ఆయన అభివర్ణించారు. తమిళనాడులో డిఎంకె, కాంగ్రెస్ కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు కూడా ఇడిని బిజెపి ప్రయోగించిందని, ఈ దాడులకు తాము బెదిరే ప్రస్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News