Saturday, May 4, 2024

కొత్త అప్పులకు బ్రేక్!

- Advertisement -
- Advertisement -

బాండ్ల వేలానికి ఇండెంట్ పెట్టని సర్కార్ ఆర్థిక అవసరాలు ఉండి కూడా అప్పులకు నో…

మార్చి 31వ తేదీ వరకూ రుణాలకు బ్రేక్..?

ఖర్చు పెరిగింది, ఆదాయం తగ్గింది

ఉన్న నిధులతోనే సర్దుకుపోవాలి

వాహనాల కొనుగోళ్ళపై నిషేధం

ఖర్చులన్నింటినీ తగ్గించాలని ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పు లు చేయడానికి వెనుకంజ వేస్తోందని, ఖజానాలో అందుబాటులో ఉన్న నిధులతోనే సర్దుకుపోవాలని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి ఆర్థికశాఖాధికారులకు ఆదేశించినట్లు తెలిసింది. ఖజానాకు వస్తున్న సొంత ఆదాయంతోనే ప్రభుత్వ పాలన ను కొనసాగిద్దామని, కొత్తగా అప్పులు చేయవద్దని, ఇప్పటికే ప్రభుత్వంపైనా, రాష్ట్ర ప్రజలపైన భారం ఎక్కువగా ఉందని, అం దుచేతనే ఉన్న నిధులతోనే సర్దుకుపోదామ ని సి ఎం చాలా స్పష్టంగా చెప్పారని కొం దరు సీనియర్ అధికారులు తెలిపారు. అందులో భాగంగానే రిజర్వు బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలానికి అస్సలు ఇండెంట్ కూడా పెట్టలేదని, ఈ ఆదేశాలు 2023-24వ ఆ ర్థిక సంవత్సరం ముగిసే వరకూ అమలులో ఉంటాయని తెలిపారు. అంటే రానున్న మార్చి 31వ తేదీ వరకూ అ ప్పులు చేయాలనే ఆలోచనకు బ్రేకులు వేసి నట్టేనని ఆ అధికారులు వివరించారు.

వాస్తవానికి చట్టబద్దంగా, న్యాయంగా ఆర్‌బిఐ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొనే హక్కు దేశంలోని ప్రతి రాష్ట్రానికీ ఉంటుందని, అ యితే పరిమితులకు మించకుండా మాత్రమే అప్పులు చేయవచ్చునని వెల్లడించా రు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక అవసరాలు కూ డా ఎన్నో ఉన్నాయని, రొటీ న్ పాలనతో పాటుగా ఆరు గ్యారెంటీలను అమలు చేసే క్రమంలో నెలవారీ ఖర్చులకు కనీసం 19 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చే సొంత ఆదాయం 14, 500 కోట్ల రూపాయల వరకే ఉంటోందని మిగతా నాలుగు వేల 500 కోట్ల రూ పాయల నిధులను ప్రత్యామ్నాయ మార్గాల నుంచిగానీ, ఆర్‌బిఐ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలం నుంచిగానీ ని ధులను సేకరించుకొంటూ వస్తున్నామని, ఇప్పుడు సడెన్‌గా అ ప్పులకు పోవద్దని నిర్ణయం తీసుకోవడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని వివరించారు. దే శంలోని అన్ని రాష్ట్రాలూ భారీగానే అప్పులు చేశాయ ని, అప్పులు చేసిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం 23వ స్థానంలో ఉందని, రాష్ట్ర జిఎస్‌డిపిలో అప్పులు 27.1శాతం (2023 మార్చి 31 నాటికి) వరకూ ఉన్నాయని, ఆ అప్పుల శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి (2024 మార్చి 31వ తేదీ) ఏకంగా 23.8 శాతానికి పడిపోయాయని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని రకాల అప్పులు కలిపి 5.75 లక్షల కోట్ల రూపాయల వరకూ అప్పులున్నాయనే ఉద్దేశ్యంతోనే కొత్తగా అప్పులు చేయవద్దని, ఉన్న నిధులతోనే సర్దుకుపోతూ ఖర్చులు తగ్గించుకోవాలని, కొత్తగా ఎలాంటి వాహనాలను కొనుగోలు చేయవద్దని, ఇతరత్రా ఖర్చులన్నింటినీ తగ్గించుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు.

కేవలం రాష్ట్రాలే కాకుండా చివరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులు, పరిధులను దాటిపోయి అప్పులు చేశాయని, కొన్ని రాష్ట్రాలైతే ఏకంగా 30 శాతం నుంచి 53 శాతం వరకూ అప్పులు చేశాయని వివరించారు. వాస్తవానికి ఈనెల 9వ తేదీన ఆర్‌బిఐ నిర్వహించే బాండ్ల వేలంలో తొమ్మిది రాష్ట్రాలు పాల్గొంటున్నాయని, తెలంగాణ కంటే అత్యధికంగా అప్పులు చేసిన అస్సాం, గుజరాత్, జమ్ము అండ్ కాశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పాం డిచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలు పాల్గొంటున్నాయని వివరించారు. ఈ 9 రాష్ట్రాలన్నీ తెలంగాణ కంటే ఎక్కువగా అప్పులు చేసినవేనని, ఈ రాష్ట్రాలన్నీ ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని దాటిపోయి అప్పులు చేసేందుకు వేలంలో పా ల్గొంటున్నాయని, అంతెందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని ఎప్పుడో దాటిపోయిందని, అయినప్పటికీ కేంద్రం కూడా నెలనెలా సగటున 33 వేల కోట్ల రూపాయలను అప్పులు తెచ్చుకుంటోందని ఆ అధికారులు వివరించారు. కేంద్రం జిడిపిలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదని, కానీ ప్రస్తుత కేంద్ర సర్కార్ ఏకంగా 54 శాతానికి పైబడి అప్పులు చేసిందని, అదే విధంగా రాష్ట్రాలు కూడా జిఎస్‌డిపిలో 20 శాతానికి మించి అప్పులు చేయకూడదని, కానీ దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఆ పరిధిని దాటిపోయాయని, ఒక్కో రాష్ట్రం కనీసం 30 శాతం గరిష్టంగా 53 శాతం వరకూ అప్పులు చేసి అప్పుల్లో కూరుకుపోయాయని వివరించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు లు పెరిగిన తర్వాత కూడా అప్పులకు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకోవడం సాహసోపేతమైన నిర్ణయమేనని అంటున్నారు. దీనికితోడు ఇక నుంచి ప్రభుత్వ ఉదోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీన్నే జీతాలు చెల్లించాలని కూడా ప్రభుత్వ పెద్దలు లక్షంగా పెట్టుకు న్నాదని వివరించారు. ఖజానాలో అరకొరగా నిధులున్నాయని, అందుబాటులో ఉన్న కొద్దిపాటి నిధులతో ఆరు గ్యారెంటీల అమలుకు, ప్రజావాణిలో వచ్చిన విన్నపాలు, దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కూడా భారీగానే నిధులు ఖర్చవుతాయని వివరించారు.

వాస్తవానికి 2023-24వ ఆర్ధిక సంవత్సరంలో అప్పులు, ఇతరత్రా రుణాల సమీకరణతో సుమా రు 43 వేల కోట్ల రూపాయల నిధులను సేకరించాలని బడ్జెట్‌లో లక్షంగా పెట్టుకొన్నామని, అందులో కేవలం 37 వేల కోట్ల రూపాయలను మాత్రమే సమీకించుకొన్నామని, ఇంక నూ కనీసం ఆరు వేల కోట్ల రూపాయల వరకూ నిధులను సమీకరించుకునే అవకాశం, వెసులుబాటు ఉందన్నారు. కానీ రుణాల రూపంలో నిధులను సేకరించుకోవడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారో అర్ధం కావడంలేదని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News