Sunday, April 28, 2024

రూ.2000 నోటు రద్దు..బంగారం, రియల్ ఎస్టేట్‌కు జోష్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రూ.2,000 నోటు రద్దు తర్వాత మాల్స్, జువెలరీ షాప్‌లు, పెట్రోల్ పంపుల్లో ఈ కరెన్సీ నోటు తాకిడి పెరిగింది. అంతేకాదు రియల్ ఎస్టేట్, భూముల డీల్స్, సెకండరీ మార్కెట్ అపార్ట్‌మెంట్ విక్రయాలు ఊపందుకున్నాయి. నోటు ఉపసంహరణ తర్వాత తొలి 15 రోజుల్లోనే డిపాజిట్ల రూపంలో రూ.3.3 లక్షల కోట్లు (80 శాతం) వచ్చాయి. 2023 మే 19న ఆర్‌బిఐ రూ. 2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. విలువ పరంగా, 2023 మార్చి నాటికి 2000 నోట్ల (రూ. 3.62 లక్షల కోట్లు) వాటా 10.8 శాతం వద్ద ఉంది. దీనిలో దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల నోట్లు డిపాజిట్లుగా వచ్చాయి. ఈ మేరకు ఎస్‌బిఐ ఎకోవ్రాప్ నివేదిక వెల్లడించింది. అదనపు డిపాజిట్లు రూ.1.8 లక్షల కోట్లు వచ్చాయి. రద్దుతో బ్యాంకు డిపాజిట్లు పెరగడమే కాకుండా రుణాల చెల్లింపు, వినియోగం పెరిగింది.

వినియోగ డిమాండ్‌లో పెరుగుదల
రూ.2000 నోటును రద్దు చేయడం వల్ల వినియోగ డిమాండ్ తక్షణమే పెరగడం ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి అని నివేదిక వెల్లడించింది. ఆర్‌బిఐ నోట్ల రద్దు చర్యతో దేవాలయాలు, ఇతర మత సంస్థలకు విరాళాలు కూడా పెరిగే అవకాశం ఉందని ఎస్‌బిఐ ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. దీంతో పాటు బంగారం, ఆభరణాలు, ఏసీ, మొబైల్ ఫోన్లు, రియల్ ఎస్టేట్ వంటి కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బోటిక్ ఫర్నిచర్ కొనుగోలు కూడా ఊపందుకోనుంది. బంగారు ఆభరణాల అమ్మకాలు 10-20% పెరిగాయి. ఇంధన చెల్లింపులు, క్యాష్ ఆన్ డెలివరీలో పెరుగుదల ఉంది. ఇప్పటికే ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన నాలుగింట మూడొంతుల మంది వినియోగదారులు రూ. 2,000 నోట్ల ద్వారా నగదు చెల్లింపులు చేస్తున్నారని తెలిపింది.

జిడిపి పెరగొచ్చు
2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవడం వల్ల వినియోగం పెరిగింది. దీని వల్ల 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.1 శాతంగా ఉంటుందని ఎస్‌బిఐ నివేదిక చెబుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి ఆర్‌బిఐ అంచనా 6.5 శాతం కంటే ఎక్కువగా ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది.

సగానికి పైగా నోట్లు వెనక్కి
రూ.2000 డినామినేషన్ నోట్లలో సగానికిపైగా తిరిగి వచ్చినట్లు జూన్ ప్రారంభంలో ఆర్‌బిఐ వెల్లడించింది. ఇందులో 85 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో రాగా, 15 శాతం బ్యాంకు కౌంటర్లలో ఇతర డినామినేషన్ల నోట్లకు మార్పిడి జరిగింది. రూ.2000 నోట్ల రూపంలో సిస్టమ్‌లో మొత్తం రూ.3.08 లక్షల కోట్లు డిపాజిట్లుగా తిరిగి వస్తాయని ఎస్‌బిఐ తన నివేదికలో పేర్కొంది. ఇందులో దాదాపు రూ.92,000 కోట్లు పొదుపు ఖాతాల్లో జమ అవుతాయి. అందులో 60 శాతం అంటే రూ.55,000 కోట్లు ఉపసంహరణ తర్వాత ఖర్చు కోసం ప్రజలకు చేరతాయి. నివేదిక ప్రకారం, వినియోగంలో గణనీయమైన పెరుగుదల కారణంగా ఈ మొత్తం పెరుగుదల దీర్ఘకాలంలో రూ.1.83 లక్షల కోట్ల వరకు ఉండవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News