Sunday, April 28, 2024

బొమ్మల ‘కొలువులు’

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: పారిశ్రామిక రంగంలో దూసుకపోతున్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం బొమ్మల తయారీ క్లస్టర్లపై కూడా దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వం శరవేగంగా ప్రణాళికలను సిద్ధ్దం చేసింది. సంప్రదాయ బొమ్మల తయారీకి నెలవుగా ఉన్న రాష్ట్రంలో పత్తి దిగుబడులు, ఇతర ముడి సరుకుల లభ్యత పుష్కలంగా ఉండడంతో రాష్ట్రాన్ని బొమ్మల తయారీ కేంద్రం గా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం ప్రత్యేక నజర్ సారించింది. రాష్ట్రంలో ఇప్పటికే అనేక చిన్నతరహా బొమ్మల తయారీ పరిశ్రమలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో బొమ్మల రంగంలోనూ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తద్వారా ఉపాధి అవకాశాలు బాగా పెంచవచ్చునని భావిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రాన్ని ఐటి, ఫార్మా రంగాల హబ్‌గా మార్చింది. వాటి తరహాలో రాష్ట్రాన్ని బొమ్మల తయారీ కేంద్రంగా మార్చాలని యత్నిస్తోంది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండుమల్కాపూర్లో 106 ఎకరాల స్థలాన్ని సైతం కేటాయించింది.

ఇక్కడ అత్యాధునిక బొమ్మల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇప్పటికే శామీర్‌పేటలోని తునికి బొల్లారంలో 50 ఎకరాల్లో ఏర్పాటవుతున్న బొమ్మల క్లస్టర్‌కు అదనంగా దండుమల్కాపూర్‌లో మరో క్లస్టర్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నది. ఈ రంగానికి కేంద్రం నుంచి ఎలాంటి చేయూత లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో టాయ్స్ రంగానికి ఊతమివ్వాలని తలపెట్టింది. చుట్ట్టుపక్కల పలు కుటీర పరిశ్రమలు బొమ్మలను తయారు చేస్తున్నాయి. యూనివర్సల్ టాయ్ సంస్థ జీడిమెట్లలో నెలకు లక్ష బొమ్మల తయారీ సామర్థ్యంతో సాఫ్ట్ టాయ్స్ యూనిట్‌ను నిర్వహిస్తున్నది. ఈ పరిశ్రమ విస్తరణ కోసం టిఎస్‌ఐఐసి కొన్నాళ్ల క్రితం దండుమల్కాపూర్ టాయ్స్ క్లస్టర్‌లో 5 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించింది. అలాగే బటర్‌ఫ్లై టాయ్స్, చోటా బీమ్ టాయ్స్ తదితర సంస్థలు తమ యూనిట్లను స్థాపించేందుకు ముందుకొచ్చాయి. స్థలాలు కేటాయించాలని ఇప్పటికే టిఎస్‌ఐఐసికి ప్రతిపాదనలు సమర్పించాయి. మరోవైపు పలు చిన్నతరహా బొమ్మల తయారీ కంపెనీలు కూడా సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నాయి.

స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే బొమ్మలను మన రాష్ట్రంలో అధికంగా తయారు చేస్తున్నారు. నిర్మల్లోని హస్తకళలకు 400 ఏండ్ల ఘన చరిత్ర ఉన్నది. ప్రత్యేకించి చెక్క బొమ్మల తయారీలో ఈ ప్రాంతం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇప్పటికే ఈ బొమ్మలకు జిఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) గుర్తింపు కూడా లభించింది. మరోవైపు మెదక్‌జిల్లా బొంతపల్లిలో తయారయ్యే చెక్క, లక్క బొమ్మలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. తక్కువ బరువు గల చెక్కతో తయారయ్యే ఈ బొమ్మలు చాలా కాలం మన్నుతాయి. పిల్లలతో వ్యాయామం చేయించేందుకు ఇవి ఎక్కువగా ఉపయోగపడతాయి. సరైన నైపుణ్య శిక్షణ, ఆధునిక టెక్నాలజీ అందిస్తే వీటిని సరికొత్త డిజైన్లలో అభివృద్ధి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున బొమ్మల తయారీ కేంద్రాన్ని ప్రొత్సహించేందుకు రంగం సిద్ధం చేసింది.

కొనసాగుతున్న కేంద్రం వివక్ష

బొమ్మల తయారీ కేంద్రాల మంజూరులోన కేంద్రం వివక్షే చూపుతోంది. గత ఏడాది దేశంలోకి 15 కోట్ల బొమ్మలు దిగుమతి అయ్యాయి. వాటిలో 90శాతం చైనా, తైవాన్ నుంచే వచ్చాయి. భారత్ దిగుమతి చేసుకొన్న బొమ్మల్లో 67 శాతం సురక్షితమైనవి కావని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసిఐ) తేల్చింది. ఈ నేపథ్యంలో దిగుమతులపై ఆధారపడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం టాయ్స్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నది. విదేశీ బొమ్మలపై దిగుమతి సుంకాన్ని పెంచడంతోపాటు హస్తకళలు, జీఐ గుర్తింపు పొందిన బొమ్మలకు బిఐఎస్(బ్యూరో ఆఫ్‌ఇండియన్ స్టాండర్డ్) నుంచి మినహాయింపు ఇచ్చింది.

ఈ చర్యలు దేశంలో బొమ్మల తయారి పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్ష బొమ్మల తయారీ రంగంలోనూ కొనసాగుతున్నది. స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రి జనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ పథకం కింద దేశవ్యాప్తంగా 35 టాయ్స్ క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,300 కోట్లు కేటాయించింది. వాటిలో 8 క్లస్టర్లకు గత ఏడాది బడ్జెట్‌లో ఆమోదం తెలిపింది. మధ్యప్రదేశ్‌కు మూడు, రాజస్థాన్‌కు రెండు, కర్నాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడుకు ఒక్కో క్లస్టర్ చొప్పున కేటాయించిన కేంద్రం తెలంగాణకు మాత్రం మొండి చెయ్యి చూపింది. వాస్తవానికి కర్నాటకలో ఇప్పటికే ఒక క్లస్టర్ కొనసాగుతున్నప్పటికీ కేంద్రం మరో క్లస్టర్‌ను మంజూరు చేసింది. ఎపిలో సైతం ఇప్పటికే ఒక క్లస్టర్‌ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణకు టాయ్స్ క్లస్టర్‌ను మంజూరు చేయడంలోనూ కేంద్రం తన వివక్షను మానుకోలేకపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News