Wednesday, May 8, 2024

33 జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ‘ చలో మైదాన్ ’

- Advertisement -
- Advertisement -

ఆగస్ట్ 29న రాష్ట్ర వ్యాప్తంగా శాట్స్ క్రీడా యువ సమ్మేళనాలు
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 33 జిల్లా కేంద్రాల్లో క్రీడా చైతన్య కార్యక్రమాలు
విద్యార్థి యువతలో క్రీడాసక్తి పెంపొందించే లక్ష్యంగా సదస్సులు
క్రీడారంగ నిష్ణాతులు జాతీయ, అంతర్జాతీయ క్రీడా విజేతలలో క్రీడా అవగాహన సభలు
రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి ప్రణాళిక

మన తెలంగాణ / హైదరాబాద్ : ఆగస్ట్ 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ‘చలో మైదాన్’ యువ క్రీడా సమ్మేళనాల పేరిట రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్రీడా ప్రాంగణాల్లో క్రీడా యువ చైతన్య సదస్సులు నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్ ) సన్నాహాలు చేస్తోంది. ఆగస్ట్ 29న జాతీయ క్రీడా దినోత్సవం దేశంలోని అన్ని రాష్ట్రాలలో కన్నా తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్సాహభరితంగా విజయవంతంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్ అథారిటి ఛైర్మన్, అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 17 వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, 75 నియోజకవర్గ స్టేడియాల్లో 33 జిల్లా కేంద్రాల్లో ఉన్న క్రీడా మైదానాలు క్రీడాకారులు ,యువత తో కళకళలాడే విధంగా క్రీడా చైతన్య కార్యక్రమాలు నిర్వహించే దిశగా ‘శాట్స్’ ఆలోచనలు చేస్తోంది. 15 నుండి- 36 సంవత్సరాల వయస్సు కలిగిన యువతను లక్ష్యంగా ఎంచుకొని ఇంటర్, డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్ కోర్సులు చదువుతున్న యువతను సమీకరించి, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లా కేంద్రాల్లో ‘ఆటల ద్వారా ఆరోగ్యం ఆనందం, అభివృద్ధి ’ అన్న సందేశాన్ని ప్రచారం చేసే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాల రూపకల్పన జరుగుతోంది.
33 జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో…
కాగా 33 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో స్థానిక శాసన సభ్యులు, జిల్లా పరిషత్ ఛైర్మన్‌లు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులతో, స్థానిక ప్రముఖులతో నిర్వహించే ఈ కార్యక్రమంలో యువతలో క్రీడాసక్తితో పాటు క్రీడా రంగానికి దశాబ్ది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను , అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలపై కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో మూడు నుంచి అయిదువేల మంది యువత, క్రీడాకారులు పాల్గొనే విధంగా క్రీడారంగ నిష్ణాతులతో ఆరోగ్య అవగాహన సదస్సులకు యువ కళాకారులతో క్రీడా సంబంధిత సాంస్కృతిక వినోద కార్యక్రమాల రూపకల్పన జరుగుతోంది. జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి (డివైఎస్‌ఓ) సమన్వయం చేసే ఈ కార్యక్రమాల విధి విధానాల రూపకల్పన తుది రూపం ఇవ్వడానికి స్పోర్ట్ అథారిటి అధికారులు తాజాగా కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం) ఛైర్మన్ కొమురయ్య ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా చేయూతనందించడానికి ముందుకొచ్చారు.

ఇంకా స్థానికంగా సామాజిక బాధ్యత కింద స్పాన్సర్స్‌ల సహకారం కూడా తీసుకోవాలని శాట్స్ సంస్థ యోచిస్తోంది. మొక్కలు నాటే హరిత హారం తరహా లోనే క్రీడా చైతన్యాన్ని కూడా విశాల సామాజికోద్యమంగా మలచాలని కార్యాచరణను రూపొందించారు. యువతను వారి తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసి క్రీడల ద్వారా కలిగే ఉపయోగాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని శాట్స్ కార్యక్రమాలను రూపొందిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడా విజేతల జీవిత అనుభవాలను డాక్యుమెంటరీలుగా తయారు చేసి, యువ సభల్లో ప్రదర్శించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News