Saturday, April 27, 2024

చివరి కక్ష్యలోకి చంద్రయాన్ 3

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : జాబిల్లిపై పరిశోధనలకు రోదసీ లోకి వెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్ 3 లక్షం దిశగా విజయవంతంగా దూసుకెళ్తోంది. చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి ఇది మరింత చేరువైంది. బుధవారం జాబిల్లి చివరి కక్ష లోకి ప్రవేశించింది. చంద్రయాన్ 3 కక్ష తగ్గింపు విన్యాసాన్ని బుధవారం మరోసారి విజయవంతంగా నిర్వహించినట్టు ఇస్రో ప్రకటించింది. నేటి విన్యాసంతో కక్ష తగ్గింపు ప్రక్రియలు పూర్తయ్యాయి. జాబిల్లి చుట్టూ చక్కర్లు కొట్టేందుకు ఇదే చివరి కక్ష. తాజా విన్యాసంతో వ్యోమనౌక కక్షను 153 కిమీ x 163 కిమీలకు తగ్గించినట్టు ఇస్రో వెల్లడించింది.

దీంతో ఈ అంతరిక్ష నౌక ఇప్పుడు చంద్రుడిపై 100 కిలో మీటర్ల ఎత్తున ఉన్న కక్ష లోకి చేరింది. ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన దశలన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక ఆగస్టు 17న వ్యోమనౌక లోకి ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియను చేపడతారు. అది సజావుగా జరిగితే ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయి సొంతంగా జాబిల్లిని చుట్టేస్తుంది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో వెల్లడించింది.

చంద్రయాన్ 3 ని జులై 14న ఎల్‌వీఎం 3 ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్షలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారి దీని కక్షను పెంచారు. ఇలా 18 రోజుల వ్యవధిలో దశల వారీగా అయిదుసార్లు కక్షను పెంచారు. అయిదో భూకక్ష పూర్తయిన అనంతరం , జాబిల్లి దిశగా ప్రయాణానికి గాను ఆగస్టు 1 న ‘ట్రాన్స్ లూనార్ కక్ష’ లోకి ప్రవేశ పెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్ష లోకి చేర్చారు. క్రమంగా కక్షలను తగ్గిస్తూ చందమామకు చేరువ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News