Monday, April 29, 2024

‘మెగా’ విలువ.. ‘చిరు’ ధర

- Advertisement -
- Advertisement -

Chiranjeevi is rumored land to have bought it for just Rs 3.83 crore

సొంత స్థలం కాకున్నా వెనకుండి కథ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ

పెద్దల నడుమ చేతులు మారిన కోట్లాది రూపాయాలు
సోషల్ మీడియాలో పోలీసులకు జిహెచ్‌ఎంసి అధికారుల ఫిర్యాదు

మన తెలంగాణ/పంజాగుట్ట: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో మరో భూబాగోతం వెలుగుచూసింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. సుమారు రూ.20కోట్ల విలువచేసే స్థలాన్ని సినీ ప్రముఖుడు, మెగాస్టార్ చిరంజీవి కేవలం 3.83కోట్ల రూపాయలకే కొనుగోలు చేశారని ప్రచారం సాగుతోంది. 1999లో ఇదే సొసైటీలోని 303 ప్లాట్ నెంబర్‌తో కూడిన 3,333 చదరపు అడుగుల స్థలాన్ని చిరంజీవి కొనుగోలు చేశారు. అయితే ఈ స్థలానికి దక్షిణ వైపు జిహెచ్‌ఎంసికి చెందిన 595 గజాల స్థలం ఉంది. ఈ స్థలం జూబ్లీహిల్స్ కోఆపరేటీవ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందినది మాత్రం కాదు. రికార్డులు కూడా దీన్నే స్పష్టం చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ సొసైటీ స్థలాల బయట ఉన్న ఖాళీ స్థలాలు మున్సిపల్ శాఖకు చెందినవి అని అప్పట్లో అధికారులు తేల్చారు. అందుకే ఇప్పటికీ ఆ స్థలం ఖాళీగా ఉంది. తన పొరుగునే ఉన్న స్థలాన్ని ఎలాగైనా కొనుగోలు చేయాలని నటుడు తలచారు. ఏప్రిల్ 20న రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. వాస్తవానికి ఇక్కడ మార్కెట్ ధర గజం రూ. 3,50,000 పలుకుతోంది. ఈ లెక్కన ఈ స్థలం విలువ సుమారు రూ. 20 కోట్లకు పైగానే ఉంటుంది.

కానీ జూబ్లీహిల్స్ సొసైటీ ఈ స్థలాన్ని గజం కేవలం రూ. 64,400 చొప్పున రూ. 3.83 కోట్లకు చిరంజీవికి కట్టబెట్టింది. అయితే ఇక్కడే పెద్ద ఎత్తున ఆరోపణలు వినవస్తున్నాయి. అంత విలువైన స్థలాన్ని జూబ్లీహిల్స్ సొసైటీ కారుచౌకగా అగ్రనటుడికి దఖలుపరచడమేంటన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఈ వ్యవహారంలో జూబ్లీహిల్స్ సొసైటీకి చెందిన పెద్దల హస్తం ఉందని, కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇదంతా ఆ అగ్రనటుడికి తెలిసే జరిగిందా..లేదా..? అన్నది తేలాల్సి ఉన్నది. ఈ భూబాగోతంలో జూబ్లీహిల్సల్ సొసైటీ అధ్యక్షుడు బి. రవీంద్రనాథ్, కోశాధికారి నాగరాజుతో పాటు మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే చిరంజీవి ఈ స్థలం మున్సిపాలిటీకి చెందింది అని తెలిసి కూడా ఎవరికి తెలియకుండా కొనుగోలు చేయడమేంటని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు.ఈ భూబాగోతంపై ఇప్పటికే జిహెచ్‌ఎంసి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు మరి కొందరు అవినీతి నిరోధక శాఖ ఇడికి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News