Sunday, May 5, 2024

సిఎం కెసిఆర్ అపర భగీరథుడు

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి : తాగు, సాగునీరు అరి గోసపడ్డ రోజులు, ఆనాడు కుళాయి కాడ, చేదు బావుల కాడ గుక్కెడు మంచినీళ్ల కోసం యుద్ధాలు జరిగేవి, వేసవి వచ్చిందంటే ప్రజా ప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి, పక్కనే గోదారి, కృష్ణమ్మ పరవళ్లు ఉన్న ఆంద్రోళ్ల పరిపాలనలో తాగునీళ్లు దొరక్క పడ్డ కష్టాలు వర్ణనాతీతామని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఉద్యమ నాయకులు కెసిఆర్ ముఖ్యమంత్రి కాగానే ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందిస్తున్నప్పుడు 2015లో మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారని, నవ్విన నాప చేను పండిందన్నట్లుగా సిఎం కెసిఆర్ అపర భగీరథుడై తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గడపకు మిషన్ భగీరథ నీళ్లు అందించిన ఘనుడు సిఎం కెసిఆర్ అని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తుంది తెలంగాణ సర్కార్ అని ఆయన అన్నారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని మిషన్ భగీరథ తాగు నీటి కేంద్రంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటి పండుగను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రారంభించారు. మిషన్ భగీరథ డిఈ సుదర్శన్ అధ్యక్షతన జరిగిన నీటి పండుగలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సిద్ధిపేటలో మిషన్ భగీరథకు పునాది పడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 43 వేల కోట్ల రూపాయలను మంజూరు చేసి ప్రాజెక్టు తెచ్చారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మొత్తం గోదావరి, కృష్ణ నదుల నీటిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటింటి అందించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దేనని అన్నారు.

నియోజకవర్గంలోని 5 లక్షల మందికి తాగునీరు అందిస్తుంది కల్వకుర్తి మిషన్ భగీరథ ప్లాంట్ అని అన్నారు. మాడ్గుల మండలంలో ఫ్లోరైడ్ నీళ్లు తాగి 30 ఏళ్లకే ముడతలు పడ్డ చర్మంతో ముసలితనంలా కనిపించేదని ఎమ్మెల్యే ఆనాటి సంగతులను గుర్తు చేసుకుని ఆవేదన చెందారు. కానీ నేడు ఫ్లోరైడ్ భూతాన్ని ఒక కల్వకుర్తి నుంచే కాదు మొత్తం రాష్ట్రం నుంచి తరిమేసిన ఘనుడు సిఎం కెసిఆర్ అని అన్నారు. ఏళ్లూరు రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా 0.350 టిఎంసీల నీళ్లతో కల్వకుర్తి నియోజకవర్గానికి నీళ్లు అందిస్తున్నామని అన్నారు. మిషన్ భగీరథ లాంటి గొప్ప పథకం దేశంలో మరెక్కడ లేదని, ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదని అన్నారు. 2019 ఎన్నికల ముందు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుండా మళ్లీ ఎన్నికలకు వెళ్లను అన్నారు సిఎం కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం నేడు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ త్రాగునీరు అందిస్తున్నారని అన్నారు.నీటి వనరులకు వృధా కాకుండా కాపాడుకుందామని, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన తాగునీటి వనరులను అందిద్దామని అన్నారు.

ఉత్తమ సేవలకు కృతజ్ఞతలు: మిషన్ భగీరథలో పనిచేస్తున్న సిబ్బంది మున్సిపాలిటీ ప్రజలకు, ఇతర ప్రాంతాలకు సకాలంలో తాగు నీరందిస్తున్న అధికారుల నుంచి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. కల్వకుర్తి ప్లాంట్ పనిచేస్తున్న భగవంతుతో పాటు మరో కొందరిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, మార్కెట్ కమిటీ చైర్మన్ సింగం విజయ్ గౌడ్, వెల్దండ జెడ్పిటిసి ద్యాప విజితా రెడ్డి, ఎంపిపి సామ మనోహర చెన్న కేశవులు, వైస్ ఎంపిపి కొండూరు గోవర్ధన్ గుప్తా, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ అశ్రిత్ రెడ్డి, ఆమన్‌గల్ డిఈ మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జమ్ముల శ్రీకాంత్,గంగాధర్, లక్ష్మయ్య, కౌన్సిలర్ మనోహర్ రెడ్డి, షానవాజ్ ఖాన్, కొట్ర సర్పంచ్ వెంకటేశ్వర్ రావు, మాజీ వైస్ ఎంపిపి వెంకటయ్య గౌడ్, ఎంపిటిసి గుత్తి వెంకటయ్యు, పెద్దయ్య యాదవ్, నూనె శ్రీనివాస్, ఎంపిడిఓ ఆంజనేయులు, మిషన్ భగీరథ అధికారులు సిఈ దేవి, నాగర్‌కర్నూల్ ఇంట్ర ఈఈ శ్రీధర్ రావు, కడ్తల్ ఇంట్రా డిఈ మోహన్ రెడ్డి, ఏఈలు సంతోష్, భగవంతు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News