హత్రాస్ ఘటనకు నిరసనగా రాజస్థాన్లో మౌన ప్రదర్శన
జైపూర్: కాంగ్రెస్ రాజస్థాన్ నేతలు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిఆదిత్యనాథ్ను ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్తో పోల్చారు. యుపిలోని హత్రాస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత యువతి గ్యాంగ్ రేప్, హత్య తర్వాత ఆమె అంత్యక్రియల విషయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా జైపూర్లోని షహీద్ స్మారక్ వద్ద సోమవారం కాంగ్రెస్ మౌన ప్రదర్శన నిర్వహించింది. ప్రదర్శనలో పాల్గొన్న రాజస్థాన్ అసెంబ్లీ చీఫ్ విప్ మహేశ్జోషి మాట్లాడుతూ ఆదిత్యనాథ్ను కిమ్జోంగ్తో పోల్చారు.
దేశ చరిత్రలో బాధితుల పట్ల ఏ ప్రభుత్వమూ అంత దారుణంగా వ్యవహరించలేదని జోషి విమర్శించారు. కనీసం బాధితురాలి శవాన్ని కూడా కుటుంబసభ్యులకు ఇవ్వలేదు, ఇదేనా భారతీయ సంస్కృతి అంటూ ఆ రాష్ట్ర పరిశ్రమలశాఖమంత్రి పిఎల్ మీనా ప్రశ్నించారు. మీడియా పట్ల, కాంగ్రెస్ నేతల పట్ల యుపి పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు రాజస్థాన్లో నేరాలు పెరిగిపోతున్నాయంటూ హల్లాబోల్ పేరుతో బిజెపి కూడా ఆందోళన చేపట్టింది. రాష్ట్రంలో శాంతి,భద్రతలు క్షీణించాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్పూనియా ఆరోపించారు. దేశానికి రాజస్థాన్ నేర రాజధానిగా మారుతోందని ఆయన విమర్శించారు.