భార్య ఫిర్యాదుతో కేసు నమోదు
ఇండోర్ : మధ్యప్రదేశ్లో ట్రిపుల్ తలాఖ్ కేసు నమోదైంది. 27 ఏళ్ల ముస్లిం మహిళ 30 ఏళ్ల తన భర్తపై ఫిర్యాదివ్వడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2016, ఫిబ్రవరి 7న వివాహమైన ఈ జంటకు ఓ కుమారుడు కూడా ఉండగా, కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. కట్నం వేధింపులు భరించలేక బాధిత మహిళ కొంతకాలంగా దేవాస్ జిల్లాలోని తన అత్తగారింటికి దూరంగా ఉంటోంది. ఈ సమయంలో తన భర్త హార్దాకు చెందిన మహిళతో మరో పెళ్లికి యత్నించగా తమ విషయం ఆమెకు తెలిపి అడ్డుకున్నది. దాంతో, ఆగ్రహానికి గురైన భర్త ట్రిపుల్ తలాఖ్ పేరుతో విడాకులు ఇస్తున్నట్టు బాధిత మహిళకు తెలిపాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. గతంలో ముస్లింలు ట్రిపుల్ తలాఖ్ను అనుసరించేవారు. ఇప్పుడు దానిపై చట్టపరమైన నిషేధం ఉన్నది. ట్రిపుల్ తలాఖ్ను అనుసరించినట్టు రుజువైతే మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు.