మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ ధన్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు
కోల్కతా: మమతా బెనర్జీకి ప్రజాసేవకన్నా తన అహం ముఖ్యం కావడం వల్లనే గత నెల 18న తుపాను ప్రాంతాల్లో నష్టంపై సమీక్ష చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన సమావేశానికి గైరుహాజరయ్యారంటూ ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దీనిపై చెలరేగుతున్న వివాదానికి అగ్నికి అజ్యం పోశాయి. గవర్నర్ వ్యాఖ్యలను దురదృష్టకరమైనవిగా అధికార తృణమూల్ కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తూ ముఖ్యమంత్రి రోజులో 24 గంటలు ప్రజాసేవలోనే నిమగ్నమై ఉంటున్నారని, రాష్ట్ర ప్రయోజనాలకు ఆమె ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఆమె చర్యలే చెబుతాయని పేర్కొంది. పశ్చిమ మిడ్నపూర్ జిల్లా కలైకుండలో జరిగిన ప్రధాని సమీక్షా సమావేశానికి ముందు మమత తనకు ఫోన్ చేసి సమావేశంలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఉండే పక్షంలో తాను సమావేశానికి హాజరు కానని చెప్పారని గవర్నర్ పేర్కొన్నారు. ‘ఈ విషయంలో ముఖ్యమంత్రి, ఆమె పార్టీ చెప్తున్న తప్పుడు కథనాలను సరి చేయాలనుకున్నాను.
మే 27వ తేదీ రాత్రి 11గంటల 16 నిమిషాలకు మమతనుంచి ‘అత్యవసర విషయం మాట్లాడాలి, మాట్లాడవచ్చా’ అంటూ అధికారిక మెస్సేజి వచ్చింది. ఆ తర్వాత ప్రధాని యాస్ తుపానుపై జరిపే సమావేశంలో సువేందు అధికారి ఉంటే తాను, అధికారులు సమావేశాన్ని బాయ్కాట్ చేస్తామని ఫోన్లో తెలియజేశారు. ప్రజాసేవకన్నా ఈగో పైచేయి సాధించింది’ అని ధన్కర్ వరస ట్వీట్లలో పేర్కొన్నారు. ప్రధాని జరిపిన సమీక్షా సమావేశానికి అధికారి, ధన్కర్తో పాటుగా బిజెపి ఎంపి దేబ్శ్రీ చౌధురి కూడా హాజరైన విషయం తెలిసిందే. కాగా గవర్నర్ ట్వీట్లపై టిఎంసి నాయకుడు, లోక్సభ సభ్యుడు సౌగతా రాయ్ స్పందిస్తూ‘ అలాంటి విషయాలు చెప్పేందుకు గవర్నర్కు హక్కు లేదు. రాష్ట్రప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి 24 గంటలూ పని చేస్తున్నారు. ఏం చేయాలో ఆమెకు తెలుసు’ అని అన్నారు.