టోర్నీ నిర్వహణపై నీలి నీడలు!
ముంబై: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) కొత్త సీజన్కు కరోనా వైరస్ భయం పట్టుకుంది. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో భారత్ వేదికగా జరిగే ఐపిఎల్ను వాయిదా వేయాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే మహారాష్ట్రకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రి ఐపిఎల్ను వాయిదా వేయాలని కోరిన విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఐపిఎల్ను నిర్వహించడం తమ వల్ల కాదని బిసిసిఐకి స్పష్టం చేసింది. ఇప్పటికే కర్ణాటకలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని, మరి కొందరూ అనుమానితులుగా ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఐపిఎల్ను వాయిదా వేయడమే మంచిదని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ బిసిసిఐకి సూచించారు. మరోవైపు ఇతర రాష్ట్రాలు కూడా ఐపిఎల్ నిర్వహణకు సుముఖంగా లేవనే చెప్పాలి.
ఐపిఎల్ వంటి మెగా క్రికెట్ మ్యాచ్ల ద్వారా కరోనా వైరస్ వేగంగా విస్తరించే ప్రమాదం ఉండడంతో దాన్ని వాయిదా వేయడమే మంచిదని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు బిసిసిఐకి సూచిస్తున్నాయి. ప్రతి ఏటా భారత్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కాసుల క్రికెట్ ఐపిఎల్కు అభిమానులు బ్రహ్మరథం పట్టడం అనవాయితీ. అయితే ఈసారి కరోనా వైరస్ వల్ల ఐపిఎల్ జరుగుతుందా లేదా అనేది సందేహంగా మారింది. భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం ఐపిఎల్ను నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఐపిఎల్ను షెడ్యూల ప్రకారమే నిర్వహిస్తామని స్పష్టం చేశాడు. అయితే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఐపిఎల్ నిర్వహణ తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఐపిఎల్ సాగుతుందా లేక వాయిదా పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Corona Effect: Suspense Continue on IPL 2020 Session