శీతాకాలం అనువైన సమయం
జో బైడెన్ సలహామండలి సభ్యులు డాక్టర్ వివేక్ మూర్తి
వాషింగ్టన్ : ఆరుబయలు ప్రదేశాల కన్నా ఇంట్లోనే కరోనా సులభంగా వ్యాపిస్తుందని, శీతాకాలం మరింత అనువైన సమయమని అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన బైడెన్ ఉన్నత స్థాయి ఇండో అమెరికన్ సలహాదారులు డాక్టర్ వివేక్ మూర్తి వెల్లడించారు. మాజీ అమెరికా సర్జన్ జనరల్ అయిన 43 ఏళ్ల మూర్తి బైడెన్ కు కొవిడ్ సలహా మండలి సభ్యులుగా ఉంటున్నారు. ఆదివారం వార్తా ఛానెల్కు ఇంటర్వూ ఇచ్చారు. కరోనా మహమ్మారి అలసటతో ప్రజలు విసిగి పోయారని ఆయన పేర్కొన్నారు. శీతాకాలం కావడంతో ప్రజలు ఇళ్ల లోనే ఎక్కువగా ఉండడం కరోనాకు చాలా అనువుగా ఉంటోందని అనేక నెలల పాటు కరోనాతో సహజీవనం చేయవలసి వస్తోందని తెలిపారు. కరోనా అలసటలో భాగం అంటే విందులు, వినోదాలు, క్రీడల్లో జనం వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉంటున్నందున ఇతరులను ప్రమాదం లోకి నెట్టివేస్తున్నారని ఫలితంగా ప్రజారోగ్య విభాగాలు చాలా కేసులను మళ్లీ గుర్తించ వలసి వస్తోందని అన్నారు.
అందుకే ఇటీవల మళ్లీ కేసులు పెరుగుతున్నాయని, తక్షణం మనం చేయవలసిన పనుల్లో ఒకటి కేసులను అదుపు చేయడమే కర్తవ్యంగా ఆయన సూచించారు. పరీక్షల సామర్థం పెంచడం, వ్యాప్తి ఉనికిని గుర్తించడం చాలా అవసరమని బైడెన్ సూచిస్తున్నారని, వ్యక్తిగత రక్షణ పరికరాల ఉత్పత్తి పెంచాలని చెబుతున్నారని మూర్తి వివరించారు. ఆరోగ్యభద్రత కార్యకర్తలందరికీ మాస్క్లు, గ్లోవ్స్ అందుతాయని చెప్పారు. రుజువుల ఆధార మార్గదర్శకాలు వల్ల స్కూళ్లు, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వసంస్థలు,భారీ క్రీడా పోటీల్లో సురక్షితంగా ఎలా ఉండాలో అవగాహన కలుగుతుందని చెప్పారు. ఇటీవలి ఎన్నికలను ప్రస్తావిస్తూ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి నుంచి అనుమతించడం వరకూ అంతా రాజకీయం చేశారని, దానివల్ల చాలామంది ఇబ్బంది పడ్డారని ఆయన గుర్తు చేశారు.