చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ వెల్లడి
బీజింగ్ : తాము రూపొందించిన కరోనా వ్యాక్సిన్ మనుషులపై ప్రయోగించగా సురక్షితమని నిర్ధారణ అయిందని, అలాగే రెండో వ్యాక్సిన్ కూడా సత్ఫలితాలు ఇచ్చిందని చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (సిఎన్బిజి) ఆదివారం వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ ఒకటి, రెండు దశల ట్రయల్స్లో 1120 ఆరోగ్యవంతులపై ప్రయోగాలు చేశారు. వీరందరిలోనూ ఎక్కువ స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ వుయ్చాట్లో ఈ వివరాలను పోస్టు చేసినట్టు సిఎన్బిజి తెలియచేసింది. అయితే అదనపు వివరాలు వెల్లడించలేదు.
ప్రభుత్వ అనుబంధ చైనా నేషనల్ ఫార్మాక్యూటికల్ గ్రూప్ (సైనోఫామ్) కు అనుబంధమైన సిఎన్బిజి ఈ సందర్భంగా మరో వ్యాక్సిన్ వివరాలు తెలియచేసింది. వుహాన్ కేంద్రమైన యూనిట్ కూడా ఈ నెల మొదట్లో మరో వ్యాక్సిన్ను తయారు చేసిందని, క్లినికల్ ట్రయల్లో మనుషులపై జరిగిన ప్రయోగాల్లో యాంటీబాడీలు అత్యధిక స్థాయిలో సురక్షితంగా ఉత్పత్తి అయ్యాయని సిఎన్బిజి వెల్లడించింది. మూడో దశ ట్రయల్లో వ్యాక్సిన్ సమర్ధత నిరూపణ కావలసి ఉంది. ఈ ట్రయల్లో వేలాది మందిపై పరీక్ష చేస్తారు. ఇవన్నీ పూర్తయితే అమ్మకానికి వ్యాక్సిన్ సిద్ధమౌతుంది.