వైరస్ వ్యాపిస్తుందని భయాందోళనలో ప్రజలు
గత వారం రోజులుగా 200లకు చేరువలో కేసుల నమోదు
బయటకు వెళ్లాలంటే జంకుతున్న జనం
హైదరాబాద్ : నగరంలో కరోనా మహమ్మారి రెక్కలు కట్టుకుని ప్రజల ప్రాణాల తో చెలగాటం ఆడుతుంది. వారం రోజుల్లో కేసుల సంఖ్య 200లకు చేరువలో ఉండగా, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు కరోనా మరింత వేగంగా విజృంభణ చేస్తుందని, రానున్న రోజుల్లో 300లు దాటవచ్చని నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైద్య బృందాలు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తుందడటంతో దగ్గు, జలుబు, జ్వరం, లక్షణాలు ఉన్న వారు ఎక్కువగా ఉన్నట్లు పేర్కోంటున్నారు. వీరికి కరోనా వ్యాధిలా, సీజనల్ వ్యాధులా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో రోజు చినుకులు కురుస్తుండటంతో రాజధాని నగరాన్ని వైరస్ అతలాకుతలం చేస్తుందని వైద్యులు భావిస్తున్నారు.
ఒక పక్క సీజనల్ వ్యాధులు, మరో పక్క కరోనా విజృంభించడంతో పరిస్థితి అంచనా వేయడం కష్టంగా మారిందని అధికారులు వెల్లడిస్తున్నారు. నగర ప్రజలు ఇష్టానుసారంగా రోడ్లపైకి రాకుండా అత్యవసర పరిస్థితిల్లో మ్రామే రావాలని, వచ్చే వారు మాస్కు లు, శానిటైజర్ వినియోగించాలని చెబుతున్నారు. గత వారం రోజులుగా కేసుల వివరాలు చూస్తే ఈ నెల 9న 143, 10న 143, 11న 175, 12న 123, 14వ తేదిన 195 కేసులు, 15వ తేదిన 189 కేసులు నమోదై రాష్ట్రంలో గ్రేటర్ నగరం అగ్రస్థానంలోకి వచ్చింది. వర్షాల దెబ్బకు కేసుల సంఖ్య రెండింతలు పెరగవచ్చని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాల కు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.