Sunday, April 28, 2024

కొవిడ్19తో ప్రపంచానికి ఇప్పటికీ ముప్పు పొంచి ఉంది

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: ప్రపంచ దేశాలకు కొవిడ్19 వల్ల ప్రస్తుతానికి హెల్ ఎమర్జెన్సీ లేనప్పటికీ అది ఇప్పటికీ ప్రపంచ ఆరోగ్య ముప్పుగానే ఉందని, కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ వేరియంట్‌ను గమనిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్లుహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఘెబ్రియేసస్ చెప్పారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని మహత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం జి20 ఆరోగ్య మంత్రుల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.‘ కొవిడ్19 ఇప్పుడు ఎంతమాత్రం ప్రపంచ హెల్త్ ఎమర్జెన్సీగా లేనప్పటికీ అది ఇప్పటికీ ఆరోగ్యపరమైన ఓ ముప్పుగానే ఉంది.అత్యధిక పరివర్తనలు కలిగిన బిఎ 2.86 వేరియంట్‌ను డబ్లుహెచ్‌ఓ ‘పర్యవేక్షణలో ఉన్న వేరియంట్’గా పేర్కొనింది. అంటే అన్ని దేశాలు కూడా అప్రమత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది’ అని టెడ్రోస్ చెప్పారు.

వచ్చే ఏడాది జరిగే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ సమావేశంలో ఆమోదించడానికి వీలుగా అన్ని దేశాలు కూడా మహమ్మారి ఒప్పందాన్ని ఖరారు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ‘ ఆరోగ్యం ప్రమాదంలో పడితే ప్రతి ఒక్కటీ ప్రమాదంలో పడుతుందనే గుణపాఠాన్ని కొవిడ్19 మనకు నేర్పింది. మహమ్మారికి చెందిన బాధాకరమైన పాఠాలను ప్రపంచం నేర్చుకుంటోంది’ అని టెడ్రోస్ జి20 సభ్యదేశాలనుద్దేశించిచేసిన ప్రసంగంలో చెప్పారు. ప్రాథమిక ఆరోగ్యసేవల స్థాయిలో టెలీ మెడిసిన్‌ను ప్రవేశపెట్టిన భార త్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. అంతేకాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద బీమా పథకం అయిన ఆయుష్మాన్ భారత్ ద్వారా అందరికీ ఆరోగ్య బీమా కల్పించాలన్న తన హామీకి కట్టుబడినందుకు కూడా ఆయన మన దేశాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కూడా మాట్లాడారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News