మిస్ ఇండియా మానసతో పాటు 17మందికి కొవిడ్ పాజిటివ్
ప్యూర్టోరికో : ప్రపంచ సుందరి పోటీలపై కరోనా ప్రభావం పడింది. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా మిస్ ఇండియా2021 మానస వారణాసితో పాటు పలువురు కరోనా బారిన పడటంతో ఆ పోటీలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం ప్రపంచ సుందరి ఫైనల్ పోటీలు గురువారం ప్యూర్టోరికాలో జరగాల్సి ఉంది. అయితే ఫైనల్కు ముందే మానసతో పాటు మరికొందరు కరోనా బారిన పడ్డారు. మొత్తం 17 మందికి కోవిడ్ సోకింది. దీంతో ముందు జాగ్రత్తగా అందాల పోటీలను వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రాబోయే 90 రోజుల్లో ప్యూర్టో రికోలోని జోస్ మిగ్యుల్ అగ్రెలాట్ కొలిజియంలో మిస్ వరల్డ్ పోటీల ముగింపు షెడ్యూల్ చేస్తామని నిర్వహకులు ప్రకటించారు. కాగా 23 ఏళ్ల మానస వారణాసి ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మిస్ ఇండియా 2020 పోటీల్లో విజేతగా నిలిచింది. తద్వారా 70వ ప్రపంచ సుందరి పోటీలకు అర్హత సాధించింది. అయితే కరోనా కలకలంతో పోటీలు వాయిదా పడక తప్పలేదని నిర్వహకులు వెల్లడించారు.