Tuesday, April 30, 2024

యాదాద్రిలో భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రసిద్ధి క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ స్వామివారి దర్శనార్ధం కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో కలిసి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసర ప్రాంతాలు నమోఃనారసింహ అంటూ శ్రీలక్ష్మీనారసింహున్ని స్మరిస్తూ భక్తజనులు దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో పూజా కైంకర్యాలు ప్రారంభించారు.ఉదయం అష్టోత్తరం, అభిషేకం, నిత్యకల్యాణం, సువర్ణపుష్పార్చనతో పాటు శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజ, సాయంత్రం వెండి జోడి మొక్కు సేవలో భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు.

ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు దర్శనం క్యూలైన్లు, ప్రసాద క్యూలైన్లు, నిత్యకల్యాణం, కల్యాణకట్టలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి తరలివచ్చిన భక్తులకు సుమారు 2 గంటల సమయం పట్టింది. శ్రీలక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న భక్తులు కొండపైన కొలువైన శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. యాదాద్రి అనుబంధ క్షేత్రమైన శ్రీపాతలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించి తమ మొక్కులను తీర్చుకున్నారు.

ఆలయ నిత్యరాబడి..
స్వామివారి ఆలయ నిత్యరాబడిలో భాగంగా ఆదివారం రూ.46,93,411 ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.19,89,100, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.5,11,050, వీఐపీ దర్శనం ద్వారా రూ.3,90,000 లక్షలు, బ్రేక్ దర్శనం ద్వారా రూ.3,44,700, కొండపైకి వాహనాల అనుమతి ద్వారా రూ.6,00,000 లక్షలతో పాటు వివిధ శాఖల నుంచి ఆలయానికి నిత్యరాబడి సమకూరినట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News