Monday, April 29, 2024

రేవంత్ రెడ్డి చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలి: దాసోజు శ్రవణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలని బిఆర్‌ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ అన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యాకనే కాంగ్రెస్ ఓట్లన్నీ బిజెపికి పోతున్నాయని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బిజెపికి అమ్ముడు పోయారని, ఆయన పిపిసి అధ్యక్షుడు అయ్యాకే దుబ్బాక, హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి బిజెపికి అమ్ముడుపోకపోతే కాంగ్రెస్ ఓట్లు బిజెపికి ఎందుకు మల్లాయో సమాధానం చెప్పాలని..? నిలదీశారు. శనివారం బిఆర్‌ఎస్ నాయకులు, ఎంఎల్‌ఎ దానం నాగేందర్‌తో కలిసి దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. మంత్రి కెటిఆర్ ఢిల్లీ పర్యటనపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

రేవంత్ రెడ్డి ఒక ఎంపి, టిపిసిసి అధ్యక్షుడిగా ఉండి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి కేంద్రమంత్రిని కలుస్తే కేసుల కోసం వెళ్లారని ఆరోపిస్తున్నారని, కాంగ్రెస్ ఎంపీలు ముగ్గురు గడ్కారీ దగ్గరకు వెళ్లారు ఎందుకో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తన ఇల్లును మర్చిపోయి…కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటి పక్కనే తిరుగుతున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేకసార్లు కలిశారని, ఎందుకు కలిశారో చెప్పాలని అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడి ప్రాజెక్టుల కోసం మోడీ వద్దకు వెళ్ళారా..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై ఉన్న కేసులను ఎత్తివేయడానికి కాంగ్రెస్ సిఎంలు మోడీని కలుస్తున్నారా..? అని నిలదీశారు.

కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, చత్తీస్‌ఘడ్, రాజస్థాన్ సిఎంలు మోడీతో కలిశారని, వారు ఏ కేసుల కోసం కలిశారని అడిగారు. రేవంత్ రెడ్డికి రాజకీయాలు తెలియవని, టివిలు, పేపర్లలోని మొదటిపేజి వార్త కోసం మాత్రమే వ్యాఖ్యలు చేస్తారని విమర్శించారు.రాష్ట్ర సమస్యల పరిష్కారం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రమంత్రులను కలుస్తే కుమ్మక్కు రాజకీయమా..? అని ప్రశ్నించారు.
బిఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి ఎవ్వరూ వెళ్లరు : దానం నాగేందర్
బిఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి ఎవ్వరూ వెళ్లరని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నాయకులు దానం నాగేందర్ అన్నారు. ఒక బ్లాక్‌మెయిలర్ కింద ఎవరూ పనిచేయరని పేర్కొన్నారు. బిఅర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి మంచివాళ్ళు బిఆర్‌ఎస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ నేతలకే పొమ్మనలేక పొగపెడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఒక చీడ పురుగు- అని, కాంగ్రెస్ సీనియర్లు అందరూ ఢిల్లీకి వెళ్లి పిసిసి తీసే వరకు ఆందోళన చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్ర ప్రభుత్వం, బిజెపిపై ఒంటరి పోరాటం చేస్తున్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News