Saturday, May 4, 2024

సులభ సంపాదన కోసం అక్రమాలు..!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో: మ్యాట్రిమోని వెబ్ సైట్లను అడ్డాగా చేసుకుని పలువురు నిందితులు వివాహం చేసుకుంటానని చెప్పి మోసాలు చేస్తున్నారు. గతంలో తెలిసిన వారు ఎక్కువగా వివాహ సంబంధాలు చూసేవారు, కానీ రానురాను అందరూ బిజీ కావడంతో ఇలా చేయడం ప్రస్తుత కాలంలో సాధ్యం కావడంలేదు. దీంతో చాలామంది ఆన్‌లైన్‌లోని వివాహ వెబ్‌సైట్లపై ఆధారపడాల్సి వస్తోంది. దీనిని ఆసరాగా చేసుకుంటున్న సైబర్ నేరస్థులు నేరాలు చేస్తున్నారు. అమాయకులకు మాయమాటలు చెప్పి లక్షలాది రూపాయలు తీసుకుని మోసం చేస్తున్నారు.

నగరానికి చెందిన మహిళ తన కుటుంబ సభ్యుల సహకారంతో ఎన్‌ఆర్‌ఐలను లక్షంగా చేసుకుని మోసం చేయడం ప్రారంభించింది. దీనికి మ్యాట్రీమోనీలో నకిలీ ప్రొఫైల్ పెట్టి పలువురిని మోసం చేసింది. తాను బాగా ఆస్తిపరులమని చెప్పి ఇద్దరు ఎన్‌ఆర్‌ఐల నుంచి రూ.1.67కోట్లను వసూలు చేసి మోసం చేసింది. తన ఆస్థి న్యాయస్థానం వివాదంలో ఉందని ఆస్తి తన చేతికి రాగానే మళ్లీ డబ్బులు ఇస్తానని చెప్పి ఇద్దరు యువకుల నుంచి డబ్బులు వసూలు చేసింది. ఈ విధంగా ఇద్దరు యువకుల నుంచి రూ.1.67కోట్లు వసూలు చేసింది. డబ్బులు ఆమె బ్యాంక్ ఖాతాకు వచ్చిన తర్వాత ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసి స్పందించడం మానివేస్తోంది. జూబ్లీహిల్స్‌కు చెందిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. భర్త, అత్తా సహకారంతో మహి ళ ఇద్దరిని మోసం చేసి డబ్బులు కాజేసింది. ఇటీవలి కాలంలో పలువురు యువతీ, యువకులు వివాహం కోసం మ్యాట్రీమోని సైట్లలో తమ ప్రొఫైల్స్‌ను అప్‌లోడ్ చేస్తున్నారు.

వీటిని పరిశీలిస్తున్న నేరస్థులు నకిలీ సమాచారం ఇచ్చి వారిని మోసం చేస్తున్నారు. ఇండియాకు అక్రమంగా వచ్చి ఇక్కడే ఉంటున్న నైజీరియన్లు కూడా ఇదే విధంగా పలువురు మహిళలను మోసం చేసి డబ్బులు వసూలు చేశారు. షాదీడాట్.కామ్, భారత్‌మ్యాట్రిమోని తదితర వివాహ వెబ్‌సైట్లలో ఉన్న వివరాలు తీసుకుని వారిని సంప్రదిస్తున్నారు. మాటల్లో పెట్టి నమ్మిన తర్వాత తమ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. మొబైల్ నంబర్ తీసుకుని తాము ఇంగ్లండ్‌లో వైద్యులుగా పనిచేస్తున్నానని చెప్పి నకిలీ ప్రొఫైల్స్ పెట్టి వారిని మోసం చేస్తున్నారు. ఈ విధంగా కొద్ది రోజులు వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకున్న తర్వాత వివాహం చేసుకుంటానని చెబుతున్నారు.

ఇది నమ్మి పలువురు బాధితులు వారి మాటలు నమ్మి మోసపోతున్నారు. బాధితులతో కొద్ది రోజులు ఛాటింగ్ చేసిన తర్వాత నమ్మకం కుదిరాక డాలర్లు, బంగారు ఆభరణాలు, ఆపిల్ వస్తువులు పంపిస్తున్నానని చెబుతున్నారు. కొరియర్ ద్వారా వస్తువులు పంపిస్తున్నానని చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల తర్వాత కొరియర్ నుంచి ఫోన్ చేసినట్లు వేరే వారితో మాట్లాడిస్తున్నారు. మీకు కొరియర్ వచ్చిందని, కస్టమ్స్, జిఎస్‌టి తదితర ట్యాక్స్‌లు చెల్లించాలని వాటి కింద డబ్బులు చెల్లించాలని చెప్పడంతో బాధితులు లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి కస్టమ్స్ క్లియరెన్స్ డబ్బులు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తే వస్తువులు పంపిస్తామని చెప్పడంతో డబ్బులు పంపిస్తున్నారు. ఇలా పలు కారణాలు చెప్పి దశల వారీగా డబ్బులు తీసుకుంటున్నారు.

వైద్య వృత్తే లక్ష్యంగా …

వివాహం చేసుకుంటానని చెబుతూ మోసం చేస్తున్న నైజీరియన్లు ఎక్కువగా వైద్యుడిగా పనిచేస్తున్నానని బాధితులను మోసం చేస్తున్నారు. వైద్య వృత్తికి మంచి ఆదరణ ఉండడంతో దానిని సైబర్ నేరస్థులు ఉపయోగించుకుంటున్నారు. నైజీరియన్లకు ఇంగ్లీష్ భాషపై పట్టు ఎక్కువగా ఉండడంతో బాధితులను సులభంగా నమ్మించి మోసం చేస్తున్నారు. కూకట్‌పల్లికి చెందిన వైద్యురాలు భర్త నుంచి విడాకులు తీసుకుని వేరే ఉంటోంది. రెండో వివాహం చేసుకుందామని భారత్‌మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో తన వివరాలు పొందుపర్చింది. వాటిని చూసిని నైజీరియన్ ముఠా ఆమెకు ఖరీదైన వస్తువులు పంపిస్తున్నానని చెప్పి రెండు దఫాలుగా రూ.12,45,000 వసూలు చేశాడు. బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి గుట్టు రట్టయింది. ఇలా మాయమాటలు చెప్పి పలువురిని వివాహం చేసుకుంటానని చెప్పి నైజీరియాకు చెందిన సైబర్ నేరస్థులు మోసం చేస్తున్నారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News