Tuesday, April 30, 2024

కేంద్రం తీరుతో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలోజాప్యం

- Advertisement -
- Advertisement -
ఆందోళనలో అధికారులు

హైదరాబాద్:  కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దికి సహకరించకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్‌కు అనుమతులు జారీ చేయాకుండా మోకాలడ్డుతోందని కొంత మంది సీనియర్ అధికారులు తెలిపారు. సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద టిఎస్‌జెన్‌కో ఆధ్వర్యంలో పవర్ ప్లాంటు నిర్మిస్తుండగా బిహెచ్‌ఎల్ సంస్థ పనులు చేపడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో విద్యుత్ కొరత లేకుండా చేయడమే కాకుండా మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే బృహత్తర లక్ష్యంతో 4,276 ఎకరాల్లో యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణాన్ని చేపడుతున్నారు. సుమారు రూ , 30 వేల కోట్లతో 5 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక్కో యూనిట్ 800 మెగావాట్ల సామర్ధ్యంతో మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుత్తును తయారు చేసేలా ప్లాంటు నిర్మిస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంటుగా నిలువనున్నది.

ఈ ప్లాంటు నిర్మాణంలో కీలకమైన 5 బొగ్గు ఆధారిత బాయిలర్ల పనులు వేగంగా నడుస్తున్నాయి. సుమారు 2 వేల మంది కార్మికులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. అక్టోబర్ నాటికి రెండు యూనిట్ల పనులు పూర్తి చేసి విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతుల పేరుతో జాప్యం చేస్తుండంతో ప్లాంట్ పనులు జాప్యం జరిగేలా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కేంద్రం నిర్మాణంతో ఆ ప్రాంతంలో పర్యావరణంపైనే కాకుండా సమీపంలోని అమ్రాబాద్‌లోని అవయూరు ఇల్లులోని వణ్యప్రాణులపై పడే ప్రభావం జూన్‌లోగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ( ఎన్‌జిటి ) గత అక్టోబర్‌లోనే ఆదేశించింది. అధ్యయనం చేయాలంటే కేంద్ర పర్యావరణశాఖ జెన్‌కోకు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ( టిఆర్ ) ఉత్తర్వులు జారీ చేయాలి. ఏయే అంశాలపై అధ్యయనం చేసి సమాచారం పంపాలో టిఆర్‌ఎలో పర్యావరణ శాఖ పేర్కొంటుంది. టిఆర్ ఇస్తే నివేదిక ఇస్తామని ఇప్పటికే జెన్‌కో నాలుగుసార్లు కేంద్ర పర్యావరణశాఖకు లేఖలు కూడా రాసింది. స్పందన లేక పోవడంతో రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు కూడా కేంద్ర పర్యావరణశాఖను కలిసి ప్రయోజనం లేకుండా పోయింది.

మొదట పర్యావరణ అనుమతి (ఈసి ) 2018లోనే కేంద్ర పర్యావరణశాఖ జారీ చేసింది. కాని అమ్రబాద్ అభయారణ్య ప్రాణులు 10 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయంటూ నివేదిక రావడంతో అనుమతులు లభించాయి. కాని అభయారణ్య ప్రాంతం 10 కిలో మీటర్ల లోపే ఉన్నాయంటూ పిటిషన్ దాఖలు కావడంతో మరో సారి సర్వే చేసి 9 నెలలో నివేదిక ఇవ్వాలని, దాని ప్రకారమే ఈసి(ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ )జారీ చేయాలని పర్యావరణశాఖను ఆదేశించింది. ఆదేశాలుగా రాగానే ఆన్‌లైన్ ద్వారా జెన్‌కో కేంద్రానికి వివరాలను పంపింది. అయితే తాము టిఆర్ ఇవ్వకుండా వివరాలు ఏలా పంపుతారని కేంద్ర పర్యావరణశాఖ వాటిని తిరస్కరింది. టిఆర్‌ను వెంటనే జారీ చేయాలని అధికారులు కేంద్ర పర్యావరణశాఖకు అనేకమార్లు విజ్ఞప్తి చేసిన స్పందన రావడం లేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాంటు నిర్మాణం పూర్తయితే ప్రత్యేక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News