Wednesday, May 1, 2024

నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీ స్థాపించండి

- Advertisement -
- Advertisement -
గ్లోబల్ లాజిక్ కంపెనీని కోరిన ఎమ్మెల్సీ కవిత
సానుకూలంగా స్పందించిన కంపెనీ ప్రతినిధులు

హైదరాబాద్ : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించాలని ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.సోమవారం ఆమె సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రసిడెంట్ కృష్ణ మోహన్ వీరవల్లితో హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. కవిత విజ్ఞప్తిని పరిగణించిన ఆ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఐటీ హబ్ లో కంపెనీని ఏర్పాటు చేయాలని తాను చేసిన విజ్ఞప్తికి గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందన్నారు.యువతకు స్థానికంగానే ఉద్యోగావకాలు కల్పించాలనే ఉద్ధేశంతో సిఎంకెసిఆర్,ఐటి మంత్రి కెటిఆర్ ఐ అన్ని జిల్లాల్లో ఐటీ హబ్ లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేసి అమలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ దార్శనికతకు ఇదే నిదర్శనమని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.రవాణా, నీరు, విద్యత్తు వంటి సౌకర్యాలతో పాటు శాంతి భద్రత గురించి కంపెనీ ప్రతినిధులకు కవిత వివరించారు.ఐటీ హబ్ లో ఏర్పాటు చేయబోయే కంపెనీలకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

భవిష్యత్తులో నిజామాబాద్ లో మరిన్ని కంపెనీలు ఏర్పాటు అవుతాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. స్థానిక యువత ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కవిత విజ్ఞప్తి చేశారు.నిజామాబాద్ లో తాము కల్పించే ఉద్యోగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.భవిష్యత్తులో కంపెనీని తెలంగాణ లోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు.రవాణా సౌకర్యం విషయంలో ఆర్టీసీ బస్సులను ఐటీ హబ్ వరకు ఏర్పాటు చేస్తామని ఆర్‌టిసి ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల గుప్తా , షకీల్ తదితరులుపాల్గొన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు హైదరాబాద్ లో రెండు క్యాంపస్‌లు ఉండగా గచ్చిబౌలి, జూబ్లిహిల్స్‌లో ప్రస్తుతం దాదాపు 3 వేల మంది పనిచేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News