Friday, May 10, 2024

టీచర్ పోస్టుల భర్తీలో ఆలస్యమయ్యే అవకాశం?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ, కొత్త టీచర్లను భర్తీ చేయకుండా, విద్యావలంటీర్లు లేకుండానే అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులతోనే బోధన కొనసాగిస్తున్నారు. సర్కారు బడుల్లో వసతులు, విద్యా ప్రమాణాలు పెరగడం వల్లే విద్యార్థులు ఆకర్షితులయ్యారని అధికారులు పేర్కొంటున్నారు. అయితే విద్యార్థులకు తగినట్లుగా ఉపాధ్యాయులు లేకపోతే బోధనపై ప్రభావం పడుతుంది. అయితే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే ఖాళీలపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాతనే టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.

టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగానే గత ఏడాది ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్ష నిర్వహించగా, ఈసారి కూడా టెట్ నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 15వ తేదీన టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. టెట్ ఫలితాలు వెలువడటంతోపాటు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. అక్టోబర్ లేదా నవంబర్‌లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడినా ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు ఆరు నెలల సమయం పడుతుంది కాబట్టి వచ్చే విద్యాసంవత్సరానికే కొత్త టీచర్లు అందుబాటులోకి రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరం అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులతోనే బోధన కొనసాగించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News