హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అపర భగీరథుడు అని మంత్రి కెటిఆర్ పొగిడారు. బుధవారం సిరిసిల్లలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. జల, హరిత, గులాబీ, నీలి, శ్వేత విప్లవాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. బందనకల్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఏ రైతుకు అన్యాయం జరగదన్నారు. రైతు బంధును ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తామని, దుష్ప్రచారాలను నమ్మొద్దని హితువు పలికారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే రైతులు పండించాలని, అందరూ ఒకే పంట వేస్తే రైతులు నష్టపోతారని తెలియజేశారు. మధ్య దళారుల చేతిలో రైతులు మోసపోకూడదని కెసిఆర్ ఆలోచన అని గుర్తు చేశారు. మద్దతు ధరకు మించి రైతుకు పైసలు రావాలని ఆశభావం వ్యక్తం చేశారు. రైతులకు పంటలు పండుతుంటే కాంగ్రెస్ నేతలకు కడుపులు మండుతున్నాయని, అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా కాంగ్రెస్ నేతలు ఇప్పుడు దొంగ దీక్ష చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.