మనతెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం నాడు గడ్డివాములు అంటుకోవడంతో మంటలలో చిక్కుకున్న పశువులను కాపాడిన కానిస్టేబుళ్లు పంజాల యాదగిరి, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డిలను రాష్ట్ర డిజిపి మహేందర్రెడ్డి ప్రశంసించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి జిల్లా రామన్నపేట పోలీసులు విధి నిర్వహణలో భాగంగా కక్కిరేణి గ్రామం వెళ్లి తిరిగి పోలీస్ స్టేషన్కు వస్తుండగా ఇస్కిళ్ల గ్రామ శివారులో పశువుల కొట్టం దగ్ధం అవుతుండటాన్ని పోలీసులు గమనించారు. ఆ సమయంలో పశువుల కొట్టంలో కట్టేసిన మూగజీవాలు మంటలకు తాళలేక విలవిల్లాడటం చూసి వెంటనే వాహనాన్ని నిలిపేసి వాటిని కాపాడారు.
కానిస్టేబుళ్లు పంజాల యాదగిరి, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి ధైర్య సాహసాలు ప్రదర్శించి సకాలంలో స్పందించడంతో మూగజీవాలు ప్రాణాలతో బయటపడ్డాయి. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతంలో మంటలు చెలరేగడంతో ఆ దారిగుండా వెళుతున్న పోలీసులు రక్షించారు. ఈక్రమంలో కానిస్టేబుల్ రాకను చూసి గందరగోళానికి గురైన ఓ గేదె పొడవటానికి ప్రయత్నించినా సదరు కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించి దాని కట్లు విప్పి కాపాడాడు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో మంటలు అంతకంతకూ వ్యాపిస్తుండటం, అక్కడే మరో నాలుగైదు గడ్డివాములు ఉండటం గమనించిన కానిస్టేబుల్ యాదగిరి అక్కడే ఉన్న పశువుల పేడతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించడం ఆకట్టుకుంటోంది. పోలీసుల చొరవను ప్రతి ఒక్కరూ అభినందించడంతో పాటు ప్రశంసలు కురిపిస్తున్నారు.