దిగ్విజయ్ ట్వీట్తో కలకలం
న్యూఢిల్లీ : సిఎంగా అనుభవజ్ఞుడైన నితీశ్ కుమార్ బిజెపిని ఇక నమ్మవద్దని ఆయన ఎన్డిఎ నుంచి తక్షణం వైదొలగాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సలహా ఇచ్చారు. బీహార్ ఎన్నికలలో ఫలితాలు బిజెపి పై చేయి దశలో దిగ్విజయ్ ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈసారి తక్కువ సంఖ్యలో జెడియుకు సీట్లు రావడం నితీశ్కు ముందు ముందు బిజెపి నుంచి చిక్కులు తెచ్చిపెడుతుందని, ఆయనను బిజెపి ఎప్పుడైనా ముంచుతుందని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు.నితీశ్కుమార్ స్థాయిని బిజెపి తన కూట్నీతిలో భాగంగా దెబ్బతీసిందని దిగ్విజయ్ తెలిపారు. వెంటనే ఆయన బిజెపి వలయం నుంచి బయటకు రావాల్సి ఉందన్నారు. తేజస్వీని ఆశీర్వదించాలని సూచించారు. లాలూ, నితీశ్ కలిసి పోరాడారని, లాలూ జైలుకు వెళ్లారని, ఇప్పటికైనా బిజెపి ఆర్ఎస్ఎస్ బంధం నుంచి బయటకు వచ్చి తీరాలని లేకపోతే ముందుకు వెళ్లలేరని హెచ్చరించారు.
బిజెపి ఓ పాదుమొక్క వంటిదని, ఓ చెట్టు సాయం తీసుకుని అల్లుకుపోయి వాటి సారాన్ని పీల్చి చెట్టును ఎండిపొయ్యేలా చేసి తాను ఎదిగిపోతుందని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. బీహార్ నితీశ్ వంటి నేతకు చాలా చిన్న రాష్ట్రం అని, ఆయన జాతీయ రాజకీయాలలోకి రావాలని , కేంద్ర ప్రభుత్వ విభజించి పాలించే విధానాన్ని ప్రతిఘటించాలని, సోషలిస్టులు అంతా లౌకిక వాదాన్ని పాటించేలా చూడాల్సిన బాధ్యత నితీశ్పై ఉందని దిగ్విజయ్ సూచించారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై బిజెపి నేతల నుంచి వెంటనే స్పందనలు వెలువడ్డాయి. ఆయన మధ్యప్రదేశ్ గురించి పట్టించుకుంటే బాగుంటుందని, అక్కడ ఓడి ఇక్కడ ఉచిత సలహాలకు దిగడం ఏమిటని ప్రశ్నించారు. అయితే మహాకూటమికి కూడా గణనీయ స్థానాలు రావడం, బిజెపి కన్నా జెడియూ స్థానాలు తగ్గడం వంటి పరిణామాలు, ఇతరుల సంఖ్యాబలం కూడా ఉన్న దశలో తదుపరి సిఎంగా పగ్గాలు చేపట్టబోయే నితీశ్కు దిగ్విజయ్ సలహా బీహార్ రాజకీయాలలో కలవరానికి దారితీసింది.