Tuesday, April 30, 2024

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత వైఖరి

- Advertisement -
- Advertisement -
రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బహిరంగలేఖ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపూరిత వైఖరి పట్ల తీవ్ర నిరాశతో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి స్వయంగా ప్రధాన మంత్రి తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించే విధంగా పలుమార్లు వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురైన అన్ని రకాల ఆటంకాలను దాటుకొని, తనదైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తూ ముందుకు సాగుతు న్నదని వెల్లడించారు. అయితే, తెలంగాణ ప్రగతిని, పురోగతిని ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం, తన పరిధిలో ఉన్న అంశాలను సైతం తేల్చకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం గత తొమ్మిది సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉన్నదని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదుల ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్షతో వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టుకి రెండవ దశ పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా పక్కన బెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని పేర్కొన్నారు.

తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలైన నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆశాకిరణమన్నారు. 12.03 లక్షల ఎకరాలకు పైగా భూమికి సాగునీటిని, ప్రజలకు తాగునీటికి భరోసా అందిస్తూ, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చే ఈ బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అడ్డంకులు సృష్టించడం శోచనీయమని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది ఎకరాలు సాగులోకి రావడంతో ప్రాజెక్టు పరిధిలోని కోట్లాది ప్రజల జీవితాల్లో కచ్చితంగా గుణాత్మక మార్పు వస్తుందన్నారు. తెలంగాణ రాకముందు మహబూబ్‌నగర్, రంగా రెడ్డి, నల్గొండ జిల్లాలో కరువు కాటకాలతో తల్లడిల్లేవని, తాగునీరు లేక నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటే, సాగునీటి సౌకర్యం లేక మహబూబ్‌నగర్ జిల్లా వలసల పాలైందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథతో నల్లగొండ ఫ్లోరైడ్ రాక్షసభూతాన్ని తమ ప్రభుత్వం తరిమికొట్టిందని, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలను మరింత సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఒకప్పుడు కరువుతో తల్లడిల్లిన ఈ జిల్లాలు పచ్చబడడం కేంద్రానికి ఇష్టం లేదని, అందుకే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డు తగులుతోందని విమర్శించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలన్న తెలంగాణ ప్రజల డిమాండ్ ను పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం, అనుమతుల పేరుతోనూ అడ్డంకులు సృష్టిస్తున్నదన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా నిరాకరిస్తున్న కేంద్రం, తాజాగా పర్యావరణ అనుమతుల పేరుతో మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని సదరు లేఖలో పేర్కొన్నారు. పాలమూరుకు పక్కనే ఉన్న కర్ణాటకలోని ఎక్కువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదాను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం మొండిచేయి చూపించడం కేంద్ర ప్రభుత్వ తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఒకవైపు కృష్ణ జలాల పంపిణీ, వినియోగంపై నాలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నదని, దీంతో రాజ్యాంగబద్ధంగా నీటి వినియోగ అంశం రాష్ట్ర జాబితాలో ఉన్నా, ముందస్తు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తన సొంత సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు వాడుకోలేని దుస్థితిలోకి తెలంగాణను నెట్టివేసిందన్నారు. కృష్ణా నీళ్లలో 500 టిఎంసిల వాటా కావాలం టూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్‌ను పట్టించుకోకుండా, కనీసం ట్రిబ్యునల్ కి పంపకుండా 9 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సాచివేత ధోరణిని అనుసరిస్తున్నదని ఆరోపించారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య పూరిత, వివక్షపూరిత వైఖరి దురదృష్టకరమన్నారు.

ఇతర రాష్ట్రాల మాదిరి తెలంగాణ ప్రజలు తమ అవసరాల, అకాంక్షల మేరకు నిర్ణయాలు తీసుకొని, అభివృద్ధి పథంలో నడిచేందుకు సైతం కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యల మీద ఆధార పడేలా చేయాలనుకోవడం ముమ్మాటికి తెలంగాణ ప్రజలను అవమానించడమేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఎన్ని విధాలుగా అణచివేతకు ప్రయత్నించినా, తెలంగాణ అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను, సంకల్పాన్ని అడ్డుకోలేరని, ఇప్పటికే దాదాపు దశాబ్ద కాలంగా కేంద్రం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా, ఏ అంశంలోనూ సహకరించకున్నా అనేక రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా ముందు వరుసలో నిలుపుతూ, తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టడం లో తాము విజయం సాధించామన్నారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని అడ్డుకునే ఏలాంటి శక్తులనైనా రాజీ పడకుండా ఎదుర్కొంటామన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ పక్షపాత నిర్ణయాలు, వివక్షపూరిత వైఖరి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోకుండా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నానని సదరు బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News