Sunday, May 5, 2024

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠా గుట్టును హైదరాబాద నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, చిక్కడపల్లి పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. ముఠాలో ప్రధాన నిందితుడు డ్రగ్ సప్లయర్ ఎన్.ప్రవీణ్‌కుమార్‌తో సహా ముగ్గురు డ్రగ్ పెడలర్స్ పి.మోహన్ యాదవ్, పి.కల్యాణ్, బి.సురేష్‌లను అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితుల వద్ద నుంచి 60 బాటిల్స్ హాష్ ఆయిల్ (ప్రతి బాటిల్‌లో ఐదు గ్రాములతో కూడిన), 400 లీటర్ల పెట్రో లియం ఈథర్ (హ్యాష్ ఆయిల్ తయారీలో వినియోగించే), మూడు మొబైల్ పోన్‌లు, ఫోర్ వీలర్ వెహికల్ మొత్తంగా 14 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నంలోని అలగం గ్రామం, జి.మాడుగుల మండలానికి చెందిన గంజాయి సాగు దారులతో కలిసి హ్యాష్ ఆయిల్ తయారు చేసేవాడని పోలీసులు పేర్కొన్నారు.

ఇందు నిమిత్తం హైదరాబాద్ కూకట్‌పల్లి కెమికల్ ట్రేడర్స్‌నుంచి పెట్రోలియం ఈథర్‌ను ప్రవీణ్‌కుమార్ కొనుగోలు చేసేవాడని పోలీసులు తెలిపారు. గంజాయి సాగుదారులతో కలిసి హ్యాష్ ఆయిల్ ప్రిపేర్ చేసిన తర్వాత హైదరాబాద్, బెంగళూరు సిటిలో డ్రగ్ పెడలర్స్‌కు లీటర్స్ లేదా 5 గ్రాముల చిన్న బాటిల్స్‌లో హ్యాష్ అయిల్‌ను పంపేవాడని పేర్కొన్నారు. హ్యాష్ ఆయిల్ దందా కొనసాగింపుపై హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, చిక్కడపల్లి పోలీసులు దృష్టి సారించారు. విశ్వసనీయ సమాచారంతో డిసెంబర్ 30వ తేదీన ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌తో సహా ముగ్గురు డ్రగ్ పెడలర్స్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మరికొందరు డ్రగ్ పెడలర్స్ పరారీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News