Wednesday, May 15, 2024

వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -
సిఎం కెసిఆర్‌కు ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగ లేఖ

హైదరాబాద్:  వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని సిఎం కెసిఆర్‌కు ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నోటిఫికేషన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఆ లేఖలో డీఎస్సీ అభ్యర్థుల అవస్థలు, ఆలస్యం వల్ల కలిగే ఇబ్బందుల గురించి ఎంపి వివరించారు. తొమ్మిదేళ్ల క్రితం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని అలాంటి రాష్ట్రంలో ప్రస్తుతం ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదం స్ఫూర్తిగా సాగిన ఉద్యమం ఆశలు ఎక్కడా నెరవేరలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిన ప్రాజెక్టుల్లో ఎటువంటి మార్పు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఇచ్చిన నోటిఫికేషన్లు, భర్తీ చేసిన ఉద్యోగాలపై శ్వేత పత్రం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
తొలి టెట్ 2016 మే 22వ తేదీన
రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి టెట్ 2016 మే 22వ తేదీన జరిగిందని పేర్కొన్నారు. అందులో పేపర్-1కు 88,158 మంది హాజరు కాగా 48,278 మంది పాసయ్యారని.. పేపర్-2ను 2,51,924 మంది రాయగా 63,079 మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన లేఖలో వివరించారు. రెండో టెట్ 2017 జులై 23న నిర్వహించారని, అందులో పేపర్-1ను 98,848 మంది రాయగా 56,708 మంది పాసయ్యారన్నారు. పేపర్-2కు 2,30,932 మంది హాజరుకాగా 45,045 మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన గుర్తు చేశారు. మూడో టెట్ 2020 జూన్ 12న జరిగిందని పేర్కొన్నారు. పేపర్-1కు 3.18 లక్షల మంది హాజరయ్యారని అందులో 1,04,578 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. పేపర్-2ను 2,50,897 మంది రాయగా 1,24,535 మంది పాసయ్యారని ఎంపి ఆ లేఖలో వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 12,500 మంది డిఎడ్, మరో 15,000 మంది బిఎడ్ కోర్సు పూర్తి చేస్తున్నారని వారంతా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News