హైదరాబాద్ : సమాజంలోని పౌరుల ఆత్మగౌరవం దెబ్బతినకుండా పోలీసులు విధులు నిర్వహించాలని, దీనిలో భాగంగా పోలీస్ అధికారులు రాజ్యాంగ బద్ధంగా చట్టాలకు లోబడి ధనిక, బీదలు అనే తేడా లేకుండా సమాన సేవలను అందించాలని రాష్ట్ర డిజిపి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమిలో 335 మంది ట్రైనీ సబ్ఇన్సెక్టర్లకు, ఎఎస్ఐలకు బుధవారం నిర్వహించిన బెసిక్ శిక్షణా కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా డిజిపి మాట్లాడుతూ స్వీయ నియంత్రణ అనేది పోలీసులకు ఉండాల్సిన ప్రాధమిక లక్షణమని, ఉద్యోగ రీత్యా పోలీసులకు లభించిన అధికారాలు సామాన్య ప్రజలకు ఉపయోగించాలని, అవసరమైన సమయంలో తప్పని సరి పరిస్థితుల్లో బలప్రయోగం చేయాలని సూచించారు.
ప్రతి రోజు 24/7 గంటలు పనిచేసే పోలీసులు ప్రజల జీవితాలను ప్రభావితం చేసే విధంగా ఆదర్శనీయంగా ఉండాలన్నారు. వ్యక్తిగత క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ, లక్షాల సాధనలో స్పష్టమైన ప్రమాణాలను కలిగి ఉండాలన్నారు. సమాజంలో నిస్సహాయులకు సహాయ పడటంతో పాటు నిరంతరం జ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడే వృత్తిరీత్యా ఆనందమయ జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. సామాజికంగా మార్పు తెచ్చే కార్యకర్తలుగా పనిచేయాలన్నారు. దేశంలోనే పోలీస్ శిక్షణలో అత్యున్నత సంస్థ అయినటువంటి తెలంగాణ పోలీస్ అకాడమిలో శిక్షణ పొందటం గొప్ప విషయమన్నారు. శాంతి భద్రతల విభాగం ఎడిజిపి జితేందర్ మాట్లాడుతూ పోలీసులకు అత్యున్నత శిక్షణ ఇవ్వడంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమి దేశ వ్యాప్తంగా పలు అవార్డులను అందుకుందన్నారు.
పునాది పటిష్టంగా ఉంటేనే ఆయా భవనాలు దీర్ఘకాలం పాటు పటిష్టంగా ఉంటాయన్నారు. అదే మాదిరిగా ట్రైనీ సబ్న్పెక్టర్లు ఉత్తమ శిక్షణను పొందాలన్నారు. తమ శిక్షణ అనంతరం పోలీసులు న్యాయ బద్ధంగా పౌరులను గౌరవించేలా విధులను నిర్వహించాలన్నారు. మానవీయ విలువలు పాటిస్తూ, చట్టాలను గౌరవిస్తూ ప్రజామోదంతో పనిచేసినప్పుడే పోలీసు అధికారులు తమ శాఖకు, కుటుంబానికి, ప్రభుత్వానికి మంచిపేరు తెస్తారని ఆయన వివరించారు. పోలీస్ అకాడమి డైరెక్టర్ వికె సింగ్ మాట్లాడుతూ తమ అకాడమీలో ఇకేసారి 2వేల మందికి శిక్షణ ఇచ్చే సామర్ధం ఉందన్నారు.
తెలంగాణ పోలీస్ అకాడమిలో ఏడు భిన్న రంగాలకు చెందిన పోలీసింగ్లో శిక్షనిచ్చే ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అకాడమి జాయింట్ డైరెక్టర్ కె.రమేష్నాయుడు, డిప్యూటీ డైరెక్టర్ బి.నవీన్కుమార్, కోర్సు డైరెక్టర్ బి.రాజేష్, అసిస్టెంట్ డైరెక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. శిక్షణా కార్యక్రమంలో ఎఆర్ విభానికి చెందిన 280 డ్రైనీ ఆర్ఎస్లు, కమ్యూనికేషన్ విభాగానికి చెందిన 29మంది ట్రైనీ సబ్ఇన్సెక్టర్లు, ఎఫ్బిఐ విభాగానికి చెందిన 25మంది ట్రైనీ ఎఎస్ఐలు పాల్గొన్నారు.