మారు వేషంలో కార్యకలాపాలు కొనసాగింపు
మన తెలంగాణ/హైదరాబాద్: 25 జూన్, 1975 అర్ధరాత్రి ‘ఎమర్జెన్సీ’(అత్యయిక పరిస్థితి) విధించి 415 సంవత్సరాలైన సందర్భంగా నాటి చీకటి రోజులను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పుడు తానూ రాష్ట్రీయ స్వయం సేవ్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రచారక్గా, సామాజిక కార్యకర్తగా పనిచేసే రోజుల్లో లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలోని లోక్ సంఘర్ష సమితిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగ్ ప్రచారక్గా పనిచేస్తున్నప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై నిషేధం విధించడం జరిగింది. ఆ సమయంలో తాను మారువేషంలో ధర్మేందర్ అనే పేరుతో కార్యకలాపాలు కొనసాగించడం జరిగిందని, తనను కలవాలంటే రెండవ వ్యక్తి వద్దకు వచ్చి ‘మామాజీ’ అంటే ఆ వ్యక్తి తన దగ్గరకు తెచ్చేవాడని పేర్కొన్నారు.
బెల్లంపల్లిలో తనను పోలీసులు ‘మీసా’ చట్టం కింద అరెస్టు చేసి హైదరాబాద్ చంచల్గూడ జైలుకు తరలించి ఒక్క సంవత్సరం నిర్భందించారని బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆలె నరేంద్ర, నాయిని నర్సింహారెడ్డితో బాటు వివిధ రాజకీయ పార్టీలైన సిపిఐ, సిపిఎం, సిపిఐ(ఎంఎల్), అతివాద కమ్యూనిస్టు పార్టీలకు చెందిన వరవరరావు, చెరబండరాజు, జమైత్ ది ఇస్లామియా అనుబంధంగా ఉన్న అజీజ్ పాష లాంటి నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన మేధావులు, కవులు, కళాకారులతో వారి అభిప్రాయాలు, రాజకీయ సిద్ధాంతాలను తాను తెలుసుకున్నానని, ఈ విధంగా రాజకీయాలపై మరింత అవగాహన కలిగిందని బండారు దత్తాత్రేయ ‘ఎమర్జెన్సీ’ చీకటి రోజులను గుర్తు చేసుకున్నారు.