Sunday, April 28, 2024

పేషెంట్లే మనకు విఐపిలు

- Advertisement -
- Advertisement -

Etela said Patients are VIPs to us

 

వారికి అన్ని సౌకర్యాలు సమకూర్చాల్సిన బాధ్యత ఉంది
ప్రతి హాస్పిటల్‌ని పరిశుభ్రంగా ఉంచాలి
90 శాతం మందికి పిహెచ్‌సిలు, జిల్లా ఆసుపత్రుల్లోనే వైద్యం అందాలి
పెద్ద జబ్బులకు మాత్రమే గాంధీ, ఉస్మానియాకు రిఫర్ చేయాలి
ఆరోగ్యశాఖను పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తున్నాం
వైద్యారోగ్యశాఖ సమీక్షలో మంత్రి ఈటల రాజేందర్ వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్ : హాస్పిటల్‌కు వచ్చే పేషెంట్లే మనకు విఐపిలని, వారికి అన్ని సౌకర్యాలను సమకూర్చాల్సిన బాధ్యత వైద్యశాఖపై ఉందని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఈమేరకు ప్రతి హాస్పిటల్‌ను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన తెలిపారు. దీంతో పాటు ప్రతి హాస్పిటల్‌లో మిషన్ భగీరథ కనెక్షన్, కరెంటు కనెక్షన్‌లు సరిగ్గా ఉండేలా చూడాలన్నారు. అవసరం ఉన్న దగ్గర జెనరేటర్లను సైతం ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను కోరారు. అదే విధంగా 108, 104 , 102 వాహనాలు ఎక్కడ అవసరం ఉన్నాయో నివేదిక తయారు చేయాలని ఆయన సూచించారు. ఒక్క హాస్పిటల్‌లో కూడా పనికి రాని వస్తువులు, చెత్త ఉండకూడదని మంత్రి ఆదేశించారు. అన్నిటికీ నూతన రంగులు వేయాలని ఆయన సూచించారు. అదే విధంగా 365 రోజులు పనిచేసే వైద్యశాఖలోని ఉద్యోగులకు సకాలంలో జీతాలు అంచేలా చూడాలని ఆయన అధికారులకు సూచించారు.

ఇదిలా ఉండగా ప్రజారోగ్యం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో అంశం అని, దేశమంతా ఒకే విధానం వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర మంత్రికి వివరించినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఏం కావాలో తమకు తెలుసని లేని మెలికలు పెట్టి రాష్ట్రాలను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి కేంద్రంపై ఫైర్ అయ్యారు.

అనారోగ్య సమస్యలు తలెత్తిన 90 శాతం మంది పేషెంట్లకు పిహెచ్‌సి, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లోనే వైద్యం అందాలన్నారు. పెద్దజబ్బులు ఉన్న వారికి గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రిఫర్ చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. అదే విధంగా వైద్యం అందించడం ఎంత ముఖ్యమో రోగులతో ఆప్యాయంగా మాట్లాడడం కూడా అంతే ముఖ్యమని మంత్రి అన్నారు. ఏం చికిత్స అందిస్తున్నామో ఎప్పటికప్పుడు రోగికి, వారి బంధువులకు అందించాలని, దీని కోసం పేషెంట్ కౌన్సిలర్స్‌నూ ఏర్పాటు చేయాలని మంత్రి పేర్కొన్నారు.ప్రతి హాస్పిటల్ లో రిసెప్షన్ ఏర్పాటు చేసి వచ్చిన పేషంట్ ని గైడ్ చేయాలని మంత్రి వెల్లడించారు. సిఎం ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖను పూర్తిస్థాయిలో బలోపేతం చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.

అందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. దీనికి అధికారులంతా సహకరించాలని ఆయన కోరారు. శుక్రవారం వెంగళ్ రావు నగర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నాధికారులతో మంత్రి సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రీజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆయుష్ ఇంచార్జ్ డైరెక్టర్ ప్రశాంతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.రమేష్‌రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు, టిఎస్‌ఎంఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి, నిపుణుల కమిటి సభ్యులు డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ గంగాధర్, డిఎంఇ,టివిపిపి,డిపిహెచ్, ఆయుర్వేద, హోమియో, యునానీ, యోగ, నాచురోపతి విభాగాల అధికారులు హాజరయ్యారు.

ఆయుష్ డిపార్ట్‌మెంట్ పై రివ్యూ

భారతీయ ప్రాచీన వైద్య విధానంకు పూర్వ వైభవం తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల అన్నారు. కరోనా సమయంలో ప్రతి ఇల్లు ఒక ఆయుర్వేద సెంటర్‌గా మారిందన్నారు. వ్యాధి నిరోధక శక్తి పెంచుతున్న ఆయుష్ మందులను మ రింత అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి తెలిపారు.

మంత్రి సీరియస్

ఆయుష్ డిపార్ట్మెంట్ మీద గతంలో సుధీర్ఘ సమీక్షలు నిర్వహించి తీసుకున్న పలు కీలక నిర్ణయాలని అమలు చేయకపోవడం పై మంత్రి ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అల్లోపతీ లాగానే ఆయుష్ లో ఉన్న విభాగాల్లో విద్యార్ధులు ఐదు సంవత్సరాలపాటు చదువుతున్నప్పుడు వారికి గుర్తింపు, గౌరవం దక్కేలా చూడాల్సిన భాద్యత మన మీద ఉందని ఆయన గుర్తుచేశారు. ఆయుర్వేద, యునానీ, హోమియో, నాచురోపతి, యోగా అన్ని విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్ట్ ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఆయుష్ డిస్పెన్సరీ సెంటర్స్ అన్నిటిని వెలనెస్ సెంటర్‌లుగా మార్చాలని కోరారు. ప్రస్తుతం 440 ప్రభుత్వ డిస్పెన్సరీలు, 394 ఎన్‌ఆర్‌హెచ్‌ఎమ్ డిస్పెషరీస్ పని చేస్తుండగా, తక్కువ పేషెంట్లు వస్తున్న డిస్పెన్సరీస్ అన్నిటినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలన్నారు. పిహెచ్‌సి లోనే ఆయుష్ విభాగాలు కూడా ఉండేలా చూడాలని కోరారు. ఆయుష్ అభివృద్దికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి నివేదికను తయారుచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

తెలంగాణ వైద్య విధాన పరిషత్

వైద్య విధాన పరిషత్ లో ఉన్న 2034 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రిక్రూట్‌మెంట్ చేయడానికి ఉన్న సమస్యలు అన్నీ పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. అదే విధంగా ప్రమోషన్ ఛానల్ లో సమస్యలు లేకుండా నిబంధనలు తయారు చేయాలని మంత్రి ఆదేశించారు.
6 నెలలకు ఒకసారి ఖాళీ పోస్టులపై సిఎంతో సమీక్ష

ప్రతి 6 నెలలకు ఒక సారి ఖాళీ పోస్ట్స్ లను మెడికల్ బోర్డు ద్వారా నియామకాలు చేయడానికి ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. అదే విధంగా పని చేయని వారి మీద చర్యలు తీసుకొనేవిధంగా నిబంధనలు మార్చాలని ఆయన అధికారులకు సూచించారు. పబ్లిక్ హెల్త్ నుండి వైద్య విధాన పరిషత్ కి మార్చబడిన 15 హాస్పిటల్స్ లో బిల్డింగ్ పూర్తి అయిన వాటిల్లో అవసరం అయిన డాక్టర్స్, వైద్య సిబ్బందిని నియమించాలని అన్నారు. దీంతో పాటు ప్రతి హాస్పిటల్ కి అంబులెన్స్, రిసెప్షన్ కౌంటర్ ఉండాలన్నారు. సిటీ స్కాన్‌తో పాటు ఇతర పరీక్షలు చేసేందుకు పూర్తి స్థాయి ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. దీంతో అవసరం ఉన్న చోట్ల అన్ని వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వాటికి ఆన్యువల్ మెయింటెనెన్స్(ప్రతి ఏటా నిర్వహణ) తప్పని సరిగా ఉండాలి అని మంత్రి సూచించారు.

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్

డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సబ్ సెంటర్ నుండి పిహెచ్‌సి వరకు అన్నీ ఖాళీల వివరాలను వెంటనే అందజేయాలని మంత్రి అధికారులను కోరారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 5658 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మంత్రి కోరారు. టైమ్ బౌండ్ ప్రమోషన్లకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా ఇన్ సర్వీస్‌లో పీజీ చేసిన తరువాత వారి సేవలు వైద్య విధాన పరిషత్ ,డిఎంఇ ఆసుపత్రుల్లో వినియోగించుకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.

టిఎస్‌ఎంఐడిసిపై రివ్యూ

తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ పై మంత్రి శనివారం సమీక్షించారు.మందుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని అధికారులకు ఆదేశించారు. క్వాలిటీ టెస్ట్ చేయడానికి అవసరమైన ల్యాబ్, సిబ్బందిని పెంచాలని సూచించారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా మందుల ఉండేలా చూసుకోవాలని కోరారు. ప్రతి మెడిసిన్ వివరాలు ఆన్‌లైన్‌లో ఉండాలని, దానిలో ప్రతి టాబ్లెట్‌కి లెక్క చూపాలని మంత్రి సూచించారు.

మిషన్ భగీరథ వలన ఫ్లోరైడ్, కళ్యాణ లక్ష్మి వల్ల చైల్డ్ మ్యారేజ్‌లు తగ్గాయి

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం కోసం ఎంతో ఉపయోగపడిందని మంత్రి అన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఫ్లోరైడ్ సమస్య దూరం అయిందన్నారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులన్నీటినీ అరికట్టగలిగినమని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు కళ్యాణ లక్ష్మీ పథకం వల్ల చైల్డ్ మ్యారేజ్‌లు కూడా తగ్గిపోయాయన్నారు.తద్వారా చిన్న వయసులో గర్భం దాల్చడం, అనారోగ్యంతో పిల్లలు పుట్టడం తగ్గిపోయింది అని మంత్రి అభిప్రాయపడ్డారు. అదే విధంగా మిషన్ కాకతీయ, హరిత హారం ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంలో పరోక్షంగా సాయపడ్డాయని మంత్రి అన్నారు. వైద్యశాఖ గ్రామాల్లో పంచాయతీ రాజ్ శాఖతో, పట్టణాలలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లను సమన్వయం చేసుకొని పని చేయాలని మంత్రి సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News