Saturday, April 27, 2024

మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత

- Advertisement -
- Advertisement -
సంతాపం వ్యక్తం చేసిన మంత్రులు, ప్రముఖులు

హైదరాబాద్: మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొత్తకోట దయాకర్ రెడ్డి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని పర్కాపురం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి నుంచి దయాకర్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు అమరచింత, ఒకసారి మక్తల్ నుంచి ఆయన గెలుపొందారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన పనిచేశారు. దయాకర్ రెడ్డి మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపి కంభంపాటి రాంమోహన్‌రావు, హిందూపురం బాలకృష్ణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.. ఆయన కుటుంబసభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భావోద్వేగానికి గురయిన ఎర్రబెల్లి
దయాకర్ రెడ్డి మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి కొత్తకోట దయాకర్ రెడ్డి ఆయన పార్థివదేహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగానికి గురయ్యారు. ఆప్తమిత్రుడిని కోల్పోయానంటూ కంటతడి పెట్టారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు. అనంతరం కొత్తకోట దయాకర్ రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డిని పరామర్శించి, ప్రగాఢ సంతాపం తెలిపారు.

పాడెను మోసిన మంత్రి హరీష్‌రావు
కొత్తకోట దయాకర్ రెడ్డి అంత్యక్రియలకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ముందుగా దయాకర్ రెడ్డి కుటుంబసభ్యులను చంద్రబాబు నాయుడు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కొత్తకోట దయాకర్ రెడ్డి పాడేను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులతో కలిసి చంద్రబాబు నాయుడు మోశారు. ఇదే సందర్భంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, తదితరులు దయాకర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అంత్యక్రియల కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు, శ్రేయోభిలాషులు, పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో పర్కాపూర్ గ్రామం జనసంద్రంగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News