Sunday, April 28, 2024

నకిలీ సిఐడి పోలీసుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఓ కంపెనీ డైరెక్టర్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఎపి నకలీ సిఐడి అధికారులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకోగా, ప్రధాన సూత్రధారి ఎస్సై పరారీలో ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి నాలుగు కార్లు, 16 మొబైల్ ఫోన్లు, రూ.35,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డిసిపి వినీత్ తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపిలోని కడప జిల్లా, మైదకూర్ మండలం, గ్రామానికి చెందిన పొలిమేర మహేంద్ర కుమార్ అడ్వకేట్, షేక్ మహ్మద్ అబ్దుల్ ఖదీర్ సైబర్ ఎక్స్‌పర్ట్, విజయ్ శేఖర్ కంపెనీ మాజీ మేనేజర్ రంజీత్ స్నేహితుడు, అక్కెర రంజీత్ కుమార్ ఎజెఎ యాడ్స్ మాజీ ఉద్యోగి, బాలిగ రాహుల్, దాడిబోయిన సుబ్బా కృష్ణ, పొన్నోలు సందీప్ కుమార్, భూపతిరాజు రాఘురాజు, రాజా, ఎపి, కర్నూలుకు చెందిన సుజన్ డిఐజి రేంజ్ ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఎస్సై సుజన్ పరారీలో ఉన్నాడు. దర్శన్ సుగుణాకర శెట్టి ఎజేఏ యాడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ కంపెనీ అమెరికా ఐటి రిక్రూటింగ్, సపోర్ట్ వర్క్ చేస్తారు.

ఎజెఎ కంపెనీలో 40కిపైగా ఉద్యోగులు ఉన్నారు. మహేంద్ర, కంపెనీ మాజీ ఉద్యోగి రంజిత్ కలిసి డైరెక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ వేశారు. అడ్వకేట్ మహేందర్ తనకు సన్నిహితుడైన ఎస్సై సుజన్‌తో కలిసి దీనిపై చర్చించాడు. ఎస్సై సలహా మేరకు ఎలా బెదిరించాలో తెలుసుకున్నారు. దీనికి ఎపిసిఐడి పోలీసుల పేరు వాడుకోవాలని ప్లాన్ వేశారు. దానికి అనుగుణంగా టెక్నికల్ సాయం కోసం ఖదీర్‌ను ఎస్సై సంప్రదించాడు. నిందితులకు ఇతడే ఐడి కార్డులను తయారు చేశాడు. ఎవరూ సూడో పోలీసులుగా వ్యవహరించాలో చెప్పాడు. అందరు కలిసి ఈ నెల 26వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని కంపెనీకి తెల్లవారుజామున 1.30 గంటలకు వచ్చారు. తాము ఎపిసిఐడి పోలీసులమని, వెంటనే ఉద్యోగులు వర్క్ ఆపివేయాలని చెప్పి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. తర్వాత సర్వర్ రూమ్‌లోకి వెళ్లి దానిని ఆపివేశారు, డివిఆర్‌ను ఆపివేశారు. దీంతో కంపెనీ డైరెక్టర్ వారిని ఐడి కార్డు చూపించాలని కోరగా నిందితులు ఫోన్‌లో చూపించారు. తర్వాత డైరెక్టర్‌ను తన క్యాబిన్‌లోకి తీసుకుని వెళ్లి తమకు కేంద్ర హోం శాఖ నుంచి ఫిర్యాదు వచ్చిందని, వారికి అమెరికా నుంచి ఫిర్యాదు వచ్చిందని చెప్పారు.

క్లైంట్లతో సరిగా వ్యవహరించడంలేదని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తర్వాత దీనిని నుంచి బయటపడాలంటే సెటిల్ చేసుకోవాలని చెప్పాడంతో, డైరెక్టర్ అంగీకరించి వారితో మాట్లాడాడు. రూ.10కోట్లు ఇస్తే దీని నుంచి బయటపడవచ్చని నిందితులు చెప్పగా డైరెక్టర్ రూ.2.3కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. నిందితులకు రూ.71.80లక్షలు వివిధ బ్యాంక్ ఖాతాల ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశారు. మిగతా డబ్బులు ఇవ్వలేకపోవడంతో ముగ్గురు ఉద్యోగులు దర్శన్, హరిప్రసాద్, చేతన్‌ను ఉదయం 6.30 గంటలకు తమ కార్లలో తీసుకుని మాదాపూర్‌లోని హోటల్‌కు వెళ్లారు. అక్కడ రూమ్‌లో బంధించి మిగతా డబ్బులు ఇవ్వకుంటే చంపివేస్తామని బెదిరించారు. వారి వద్ద ఉన్న ఎటిఎంల ద్వారా రూ.2.5లక్షలు, నెట్‌బ్యాంకింగ్ ద్వారా రూ.10లక్షలు తీసుకుని ముగ్గురు ఉద్యోగులను హోటల్‌లోని వదిలేసి పారిపోయారు. కంపెనీ డైరెక్టర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News