జనగామ: ప్రభుత్వం సూచించిన పంటలనే రైతులంతా సాగు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జనగామలో నియంత్రిత పంటల సాగువిధానంపై అవగాహన సదస్సు జరిగింది. పంటల ప్రణాళిక, సాగు చేయాల్సిన పంటలు, మార్కెటింగ్, డిమాండ్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. లాభసాటి పంటలు వేసి రైతులు బాగుపడాలన్నదే సిఎం కెసిఆర్ సంకల్పమన్నారు. శాస్త్రవేత్తలు రూపొందించిన పంటల ప్రణాళిక సిద్ధంగా ఉందని, ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తేనే రైతు బంధు వంటి పథకాలు అందుతాయని, రైతును రాజుగా చూడాలన్నదే సిఎం కెసిఆర్ లక్ష్యమని ఎర్రబెల్లి పేర్కొన్నారు. భూములు, భూసారాలపై ప్రభుత్వమే పరిశోధనలు చేయించిందని, వ్యవసాయ శాస్త్రేవత్తల సూచనల మేరకే పంటల ప్రణాళిక ఉంటుందన్నారు. అన్నం పెట్టే రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. రైతులను సంఘటితం చేస్తేనే రైతు రాజ్యం అవిష్కృతమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్ఎలు పాల్గొన్నారు.