Saturday, May 4, 2024

పంట మార్చండి

- Advertisement -
- Advertisement -

Farmers have to choose Crop rotation method:CM KCRపల్లెకు పోయి పంటను చూసిన కెసిఆర్ సాగు’బడి’

ఎ’వరి’కీ పట్టని సాగు వదిలి మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఆరుతడి పంటలకు మళ్లండి

వరి వంటి ఒకే తరహా పంట వేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దు
ఇతర పంటల సాగుపై దృష్టి కేంద్రీకరించాలి, వేరుశనగ, పత్తి , మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటలు వేయండి :
గద్వాల్ నుంచి హైదరాబాద్‌కు తిరిగివస్తూ మార్గమధ్యంలో రంగాపూర్, కొత్తకోట రైతులతో ముచ్చటించిన సిఎం కెసిఆర్
మినునులు, వేరుశనగ పంటల దిగుబడిపై ఆరా

గురువారం జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తూ మార్గమధ్యలో సిఎం కెసిఆర్ ఆకస్మికంగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్, కొత్తకోట మండలం విలియం కొండ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులు సాగు చేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. మినుములు, వేరుశనగ పంటలపై దిగుబడి ఎంత వస్తుంది? మార్కెట్లో ధర ఎంత ఉంది? ఎన్ని తడులు నీళ్లు పెట్టాలి? అని రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మన తెలంగాణ/హైదరాబాద్ : వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలని రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మరోసారి సూచించారు. వరి వంటి ఒకే తరహా పంట వేసి ఇబ్బంది పడే కంటే ఇతర పంటల సాగు మీద కూడా దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. గురువారం జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తూ మార్గమధ్యలో సిఎం కెసిఆర్ ఆకస్మికంగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్, కొత్తకోట మండలం విలియం కొండ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రైతులు సాగు చేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. మొదట రంగాపూర్ దగ్గర ఆగిన సిఎం కెసిఆర్ రోడ్డు నుండి లోపలి వరకు నడుచుకుంటూ వెళ్లి మహేశ్వర్ రెడ్డి అనే రైతు సాగు చేస్తున్న మినుము పంటను, రాములు అనే మరో రైతు సాగు చేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు.

మినుములు, వేరుశనగ పంటలపై దిగుబడి ఎంత వస్తుంది? మార్కెట్లో ధర ఎంత ఉంది? ఎన్ని తడులు నీళ్లు పెట్టాలి? అని రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. మినుములు ఎకరానికి 8 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనీ, ఎంఎస్‌పి ధర క్వింటాల్‌కు రూ. 6300 ఉండగా, మార్కెట్‌లో ధర రూ.8 వేలకు పైనే ఉందని సిఎంకు రైతులు వివరించారు. వేరుశనగ 10 నుండి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందన్నారు. అలాగే ఎంఎస్‌పి క్వింటాల్ ధర రూ. 5550 ఉండగా, మార్కెట్‌లో రూ.7 వేలకు పైనే ఉందని సిఎంకు వివరించారు. పంటల మార్పిడి వల్ల భూసారం పెరిగి దిగుబడి బాగా వస్తున్నదని తెలిపారు. ఆ తర్వాత కొత్తకోట మండలం విలియం కొండ తండా రోడ్డు వద్ద కళ్ళంలో ఆరబోసిన వరి ధాన్యాన్ని సిఎం పరిశీలించారు. గోకరి వెంకటయ్య అనే రైతు వేరుశనగ పంట దగ్గరికి వెళ్లి పరిశీలించారు. సాగు విధానం, దిగుబడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని వేరుశనగ చెట్లను భూమి నుండి తీసి వేరుశనగ కాయలను సిఎం కెసిఆర్ స్వయంగా పరిశీలించారు.

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పుష్కలంగా నీళ్లు, కరెంటు సరఫరా చేస్తుండడంతో పంటల దిగుబడి బాగా పెరిగిందని వెంకటయ్య అనే రైతు సిఎం కెసిఆర్‌కు వివరించారు. కాగా కెసిఆర్ అకస్మాత్తుగా తమ పంట చేలల్లోకి రావడంతో రైతులు, గిరిజనులు ఎంతో సంతోషపడ్డారు. ఆయనతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మరోసారి ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌సి గోరెటి వెంకన్న, ఎంఎల్‌ఎలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News