Sunday, April 28, 2024

తీవ్రమైన రైతుల నిరసనలు.. ప్రభుత్వాలు అప్రమత్తం

- Advertisement -
- Advertisement -

13న రైతు సంఘాల ‘ఢిల్లీ చలో మార్చ్’ నేపథ్యంలో

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు చేపట్టిన నిరసనలు ఉద్ధృతంగా మారుతున్నాయి. 200 రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ‘ఢిల్లీ చలో ’ మార్చ్ నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేత, తదితర డిమాండ్లతో ఛలో పార్లమెంట్ కు రైతు సంఘాలు పిలుపు నిచ్చాయి.

ఈ డిమాండ్లు నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా వంటివి కూడా ఈ ఆందోళనలో పాల్గొననున్నాయి. దీంతో అప్రమత్తమైన హర్యానా, ఢిల్లీ పోలీస్‌లు అత్యవసరమైతేనే తప్ప రహదారుల పైకి ప్రజలు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు. అంబాల, సోనిపట్, పంచకుల్‌లో సెక్షన్ 144ను విధించారు. అలాగే అంబాలా, కురుక్షేత్ర, కైథల్, జింధ్, హిస్సార్, ఫతేహబాద్, సిర్సా జిల్లాల పరిధిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. హర్యానా లోని ఏడు జిల్లాల పరిధిలో ఒకేసారి భారీగా ఎస్‌ఎంఎస్‌లు పంపడంపై ఈనెల 11ఉదయం 6 గంటల నుంచి 13 రాత్రి 12 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపింది.

ప్రజలు తమ ప్రయాణాలను ముందుగా ప్లాన్ చేసుకోవాలని కోరారు. 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచారు. ఢిల్లీ సరిహద్దుల వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. పంజాబ్, హర్యానా, నుంచి రైతులు ఢిల్లీ నగరం లోకి ప్రవేశించకుండా ప్రధాన మార్గాల్లో క్రేన్లు, కంటైనర్లను సిద్ధం చేశారు. రైతులు నగరం లోకి రావాలని ప్రయత్నిస్తే క్రేన్లు, కంటైనర్లుతో సరిహద్దులను మూసివేస్తామని హెచ్చరించారు.

దీనిపై రైతు నాయకుడు జగ్‌జిత్ సింగ్ దాలెవాల్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. ఓవైపు చర్చలకు పిలుస్తూనే మరోవైపు హర్యానాలో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సరిహద్దులు మూసేశారని, 144 సెక్షన్ విధించారని, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులతో నిర్మాణాత్మక చర్చలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News