హైదరాబాద్: వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ గత మంగళవారం నుంచే ప్రారంభమైందని జిహెచ్ ఎంసి స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించడంలో జిహెచ్ఎంసి నిస్సహాయత వ్యక్తం చేసినట్లు వస్తున్న వార్తలు సత్య దూరమని, ఈ వార్తను ఖండిస్తున్నమని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం ఆదేశించినట్లుగానే ఈ నెల 7 నుంచి వరద బాధితులకు తక్షణ ఆర్ధిక సహాయం ప్రక్రియను పున:ప్రారంభించినట్లు తెలిపారు. అయితే బాధితులు మీ-సేవ సెంటర్లకు రావద్దని అధికారులే క్షేత్రస్థాయిలో పరిశీలించిన బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రక్రియ ప్రారంభించిన మంగళవారం ఒక్కరోజే 7939 మందికి రూ.7.90 కోట్లు సంబంధిత లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. చివరి బాధితుడి ఆర్థిక సహాయం అందించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులే స్వయంగా వచ్చి ఆర్థిక సహాయం అందని వారి వివరాలను సేకరించి నేరుగా బ్యాంకు ఖాతాల్లో రూ.10000వేలు జమ చేయడం జరుగుతుందని ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని జిహెచ్ఎంసి అధికారులు స్పష్టం చేశారు.
Flood relief Continues Says GHMC