ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పద మృతి
ఇంటి ఆవరణలో గొయ్యి, మృతదేహాల వద్ద నిమ్మకాయలు, పసుపుకుంకుమలు
గుప్త నిధుల కోసం బలి ఇచ్చినట్లు అనుమానాలు
వనపర్తి జిల్లా నాగపూర్ గ్రామంలో దారుణం
మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన వనపర్తి జిల్లా, రేవల్లి మండలం, నాగపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం వెలుగుచూసింది. మృతులు హజీరాబేగం(60), తన కూతురు ఆస్మా(38), అల్లుడు ఖాజాపాషా(42), మనువరాలు హస్రిన్(7) ఇంటిలో విగత జీవులు గా కనిపించారు. అల్లుడి మృతదే హం మాత్రం ఇంటి ఆవరణలో కనిపించింది. మిగిలిన ముగ్గురు ఒక్కో రూంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల ఇంటి వద్ద నిమ్మకాయలు, అగర్బత్తీలు, పసుపు, కుంకుమ, టెంకాయలు పడేసి ఉన్నాయి. ఇంటి ఆవరణలో గుంత కూడా తీశారు. క్షుద్రపూజల కోసం వీరిని ఎవరైనా బలిఇచ్చారా? లేకపోతే ఇతర కారణాల వల్ల చంపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. క్లూస్ టీం, డాగ్ స్కాడ్ను రంగంలోకి దించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒక్కసారిగా చనిపోయిన వార్త విని నాగపూర్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. మృతురాలు హజీరాబేగం భర్త కొంత కాలం క్రితం మృతి చెందాడు. వీరి కుమారుడు నాగర్ కర్నూల్లో ఆర్ఎంపిగా విధులు నిర్వహిస్తు ఇంటికి దూరంగా ఉంటున్నారు. దీంతో కుటుంబ కలహాల కోణంలో కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Four of family suspicious deaths in Nagarkurnool