Monday, April 29, 2024

పిటిసిపై అదానీ గ్రూప్ కన్ను

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పవర్ ట్రేడింగ్ కంపెనీ (పిటిసి) ఇండియాలో వాటా కొనుగోలుకు ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, ప్రపంచ కుబేరుల జాబితాలో మూడోస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ ఆసక్తి చూపుతున్నారని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. అయితే అదానీతోపాటు ఇతర కంపెనీలకూడా పిటిసిని సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాయి. ఈ నెలాఖరులోగా పిటిసి బిడ్డింగ్ వచ్చే అవకాశం ఉందని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం అదానీ గ్రూప్ పిటిసిని సొంతం చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్‌టిపిసి లిమిటెడ్, ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్, పవర్ గ్రిడ్ కారొరేషన్ ఆఫ్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పిటిసి ఇండియా ప్రమోటర్ కంపెనీలుగా ఉన్నాయి. ఇవి పిటిసి ఇండియాలోని నాలుగుశాతం వాటాను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై ఆ కంపెనీలు నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

ఈ కంపెనీలో అదానీ గ్రూప్ వాటాను కొనుగోలు చేస్తే దేశ ఇంధనరంగంలో అదానీ మరింత బలోపేతం అవుతుంది. అదానీ గ్రూప్ ఇప్పటికే బొగ్గు మైనింగ్, ట్రేడింగ్ వ్యాపారంతో ఇంధన రంగంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. మరోవైపు అదానీ గ్రూప్ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ వాణిజ్యంలో కీలకంగా మారింది. అయితే అదానీ గ్రూప్ నుంచి తమకు ఎటువంటి సమాచారం అందలేనది పిటిసిప్రతినిధి తెలిపారు. కాగా అదానీ తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ తమ గ్రూప్ 22రాష్ట్రాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు.

ప్రధాని మోడీతో ఉన్న అనుబంధంతో విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపరని విమర్శను తోసిపుచ్చారు. ప్రతి రాష్ట్రంలో అదానీ గ్రూప్ పెట్టుబడి పెట్టాలని కోరుకుంటున్నామన్నారు. 22రాష్ట్రాల్లో అదానీ గ్రూప్ పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ రాష్ట్రాలన్నింటిలోనూ బిజెపి ప్రభుత్వం మాత్రమే అధికారంలో లేదని తెలిపారు. లెఫ్ట్ పాలనలోని కేరళ, మమతా దీదీ పాలనలోని పశ్చిమబెంగాల్, నవీన్ పట్నాయక్ సారథ్యంలోని ఒడిశా, జగన్‌మోహన్‌రెడ్డి, కేసిఆర్ సారథ్యంలోని తెలుగు రాష్ట్రాల్లోనూ అదానీ గ్రూప్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News