Tuesday, May 7, 2024

నర్సంపేటకు మెడికల్ కళాశాల మంజూరు

- Advertisement -
- Advertisement -

నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ప్రభుత్వం వైద్య పరంగా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూనే వైద్య విద్యకు శ్రీకారం చుట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 83ను వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసింది. ఐదేళ్లుగా నర్సంపేటలో మెడికల్ కళాశాలను ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఎంతో కృతనిశ్చయంతో ఉండి పలుమార్లు సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి కళాశాల మంజూరు చేయించడంలో సఫలీకృతులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను దఫా దఫాలుగా మంజూరు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో వరంగల్ జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అన్ని రకాలుగా అనువైన ప్రాంతమైన నర్సంపేటలో మెడికల్ కళాశాలను ఏర్పాటుచేయాలని సీఎంకు విన్నవించడంతో మెడికల్ కళాశాలను మంజూరు చేశారు.

మెడికల్ కళాశాలకు అనుగుణంగా జిల్లా ప్రభుత్వాసుపత్రిని మంజూరు చేయించి 250 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి దానికి అనుబంధంగా ఇటీవలనే నర్సింగ్ కళాశాలను మంజూరు చేయించారు. నర్సంపేట నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఒక విజన్‌తో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఇక్కడి ప్రజల అవసరాల దృష్టా ఇటీవలనే రూ. 30 కోట్ల క్రిటికల్ కేర్ సెంటర్, టి. డయాగ్నస్టిక్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. తాజాగా మెడికల్ కళాశాలను మంజూరు చేయడంతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News