అమెరికా అంగీకారం
డిహెచ్ఎస్ నోటిఫికేషన్ విడుదల
వేలాది భారతీయులకు మహా ఊరట
వాషింగ్టన్: కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న అమెరికాలో హెచ్ 1బి వీసా గడువు ముగియబోతున్న వేలాది మంది భారతీయ ప్రొఫెషనల్స్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారికిప్పుడు గొప్ప ఊరట లభించింది. హెచ్ 1బి వీసా గడువు ముగిసినా తమ దేశం ఉండేందుకు వీలుగా వారి వీసా గడువును పొడిగించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ 1బి వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. సాంకేతిక నిపుణులు లేదా థియోరిటికల్ నిపుణులు అవసరమైన విభాగాల్లో అమెరికా కంపెనీలు విదేశీ నిపుణుల్ని ప్రత్యేక హోదాలిచ్చి ఉద్యోగాల్లో నియమించేందుకు ఈ వీసా వీలు కల్పిస్తోంది. భారత్, చైనా దేశాల నుంచి వచ్చే అలాంటి వేలాది మంది నిపుణులపై అమెరికా టెక్నాలజీ కంపెనీలు ఆధారపడి ఉన్నాయి. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డిహెచ్ఎస్) ఇందుకు సంబంధించి తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఇమిగ్రేషన్కు సంబంధించిన సవాళ్లు ఎదురవుతున్నాయన్నది తాము గుర్తించామని ఆ నోటిఫికేషన్ పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ దేశాల సరిహద్దుల్ని మూసేసి, అన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకల్ని నిలిపేసిన క్లిష్ట సమయంలో ఈ ప్రకటన వెలువడింది. విమానాల రద్దుతో, రాకపోకలపై ఆంక్షలతో త్వరలో గడువు ముగియబోతున్న హెచ్ 1బి హోల్డర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వీసాల గడువు తీరనున్న వారు గడువు పెంచమని కోరుతూ దాఖలుచేసే దరఖాస్తుల్ని ఆమోదించే ప్రక్రియను డిహెచ్ఎస్ త్వరలోనే ప్రారంభించబోతోంది. అధికారికంగా వీసా గడువు తీరినా నాన్ ఇమ్మిగ్రెంట్లు ‘కోవిడ్ 19 (కరోనా వైరస్) వల్ల ఊహించని విధంగా ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితిని మేము గుర్తించాము’ అని డిహెచ్ఎస్ తెలిపింది. ‘ఇలాంటి వ్యవహారాల్ని జాగ్రత్తగా పరిశీలించడం ఇకపై కూడా కొనసాగిస్తాం. లభ్యమవుతున్న వనరుల్ని గమనించి మా అధికార పరిధిలో ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనడంపై విశ్లేషిస్తున్నాము. అలాగే అమెరికన్లకు, మా సమాజాలకు రక్షణ కల్పించే చర్యను కూడా డిహెచ్ఎస్ కొనసాగిస్తుంది. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అమెరికా వర్కర్లకు ఉపాధి అవకాశాల్ని మెరుగుపరిచే ప్రక్రియల్ని కూడా కొనసాగిస్తాం’ అని ఆ ప్రకటన తెలిపింది.