Thursday, September 25, 2025

ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా..?

- Advertisement -
- Advertisement -

అంగన్‌వాడీ టీచర్లపై రేవంత్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుండటం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఛలో సెక్రటేరియట్ పిలుపునిచ్చిన అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, కర్కషంగా వ్యవహరించడాన్ని ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటూ బీరాలు పలికిన రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలించడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా… గుర్తింపు లేదా..? అని ప్రశ్నించారు. ప్రజా పాలన అని రాక్షస పాలన కొనసాగిస్తారా..? అని నిలదీశారు. ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సంబురం లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారి ఉసురు తగులుతుందని అన్నారు.అంగన్‌వాడీల సేవలను గుర్తించిన కెసిఆర్ వారు వర్కర్లు కాదని, అంగన్‌వాడీ టీచర్లు అని పోస్టును ఉన్నతీకరించి వారి గౌరవాన్ని పెంచారని గుర్తు చేశారు.

2014 నాటికి అంగన్‌వాడీ టీచర్లకు కేవలం రూ.4,200, వారి సహాయకులకు రూ.2,200 వేతనం లభించేదని, కానీ బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని రూ.13,650లకు, మినీ అంగన్ వాడీ టీచర్ల వేతనాన్ని రూ.7,800లకు, అంగన్‌వాడీ హెల్పర్ల వేతనాన్ని రూ.7,800 లకు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించారని చెప్పారు. అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్‌వాడీ టీచర్ల వేతనాన్ని 18,000లకు పెంచుతామని, ఇపిఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. మాయ మాటలు చెప్పి, 22 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతీ లేదు, గతీ లేదని విమర్శించారు. మహాలక్ష్మి పేరిట సిఎం అమలు చేస్తున్న ఉచిత బస్సుల్లోనే జిల్లాల నుంచి సచివాలయం వద్దకు వచ్చి మిమ్మల్ని నిలదీస్తున్నారని, రేవంత్‌రెడ్డి మోసపూరిత వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అరెస్టులు చేసిన అంగన్‌వాడీలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్‌రావు బిఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.

Also Read: ‘పూరి’ గీసిన ‘చిరు’ చిత్రం.. ఆయనకెంతో స్పెషల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News