హైదరాబాద్: కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం 7వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ”కొండా లక్ష్మణ్ బాపూజీ అనగానే తొలితరం తెలంగాణ ఉద్యమ నాయకులుగా మనందరికీ గుర్తొస్తారు. బాపూజీ ఉద్యమ పోరాటంతో పాటు చేనేత అభివృద్ధికి అవిరళ కృషి చేశారు. ఆయన పేరుతో సిద్దిపేట జిల్లాలో ఉద్యానవన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం అనందదాయకం. రైతు దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేయాలి. దేశానికి అన్నం పెడుతూ.. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం వ్యాపార రంగంగా చూడకూడదు. వ్యవసాయాన్ని దండగ అనే స్థితి నుంచి కేసిఆర్ నేడు పండుగగా మార్చారు.
ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి. యూనివర్సిటీ జిల్లాలోని కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని, మార్పు దిశగా కృషి చేయాలి. లాభదాయ సాగుకు ఉద్యాన వన యూనివర్సిటీ తమ వంతు కృషి చేయాలి. వ్యవసాయ, ఉద్యాన వన యూనివర్సిటీలు డిమాండ్ ఉన్న పంటలను ప్రోత్సహించాలి. వ్యవసాయ, ఉద్యాన వన యూనివర్సిటీలు బోధనతో పాటు పరిశోధన, విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఉద్యాన వన యూనివర్సిటీ సమీపంలోనే 140 ఎకరాలను సేకరించి విశ్వవిద్యాలయ అవసరాలకు అందజేస్తాం. ఆయిల్ సీడ్, పప్పు దినుసులు, ఆయిల్ ఫామ్ సాగు, పండ్లు, కూరగాయలు పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి. రైతులు ఖర్చులు తగ్గి లాభాలు పెరిగే వంగడాలను అభివృద్ది చేయాలి. పరిశోధక విద్యార్థులు పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారించాలి. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఉద్యానవన పంటల సాగులో కష్ట నష్టాలను స్వయంగా తెలుసుకోవాలి. సత్ఫలితాలు ల్యాబ్ టు ల్యాండ్ వెళితేనే ప్రయోజనం. ఉద్యాన వన యూనివర్సిటీ నిధుల మంజూరు, రిక్రూట్ మెంట్, భూ కేటాయింపులు, ఇతర సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యేలా చూస్తాం” అని పేర్కొన్నారు.
Harish Rao speech at Konda Laxman Horticulture University