సెప్టెంబర్ 13న పరీక్ష, ఈసారి 15.97 లక్షల మంది నమోదు
హైదరాబాద్ : దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు సెప్టెంబర్ 13న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్ 2020)కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్(హాల్టికెట్లు) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) విడుదల చేసింది. ఇప్పటికే జెఇఇ మెయిన్స్ 2020కి సంబంధించిన అడ్మిట్కార్డులను విడుదల చేయగా, తాజాగా నీట్ అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ముందుగా ప్రకటించినట్లుగానే జెఇఇ (మెయిన్స్) 2020 పరీక్షలు సెప్టెంబరు 1 నుంచి 6 వరకు, నీట్ 2020 పరీక్ష సెప్టెంబరు 13న నిర్వహించనుంది.
జెఇఇ మెయిన్, నీట్ పరీక్షల సందర్భంగా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్టిఎ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి నిర్ణీత నిబంధనలు పాటించడాన్ని తప్పనిసరి చేస్తూ ఎన్టిఎ ఆదేశాలిచ్చింది.జెఇఇ మెయిన్ పరీక్షలను ఆన్లైన్ విధానంలో నిర్వహించనుండగా, నీట్ పరీక్షను ఆఫ్లైన్ విధానంలో(రాత పరీక్ష) నిర్వహించనున్నారు. ఈ సారి జెఇఇ మెయిన్ పరీక్షలకు దేశవ్యాప్తంగా 8.58 లక్షల మంది నమోదు చేసుకోగా, నీట్ పరీక్షకు 15.97 లక్షల మంది నమోదు చేసుకున్నారు. నీట్ పరీక్షకు తెలంగాణలో 112 కేంద్రాలలో 55,800 మంది విద్యార్థులు హాజరుకానుండగా, ఎపిలో 151 పరీక్షా కేంద్రాలలో 61,892 మంది హాజరుకానున్నారు.
భౌతిక దూరం కోసం కేంద్రాల పెంపు
కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాలలో భౌతికదూరం పాటించే విధంగా జెఇఇ మెయిన్, నీట్ పరీక్షలకు ఈ సారి పరీక్షా కేంద్రాలు పెంచారు. జెఇఇ మెయిన్ పరీక్షలకు గతేడాది దేశవ్యాప్తంగా 2,546 కేంద్రాలు ఉండగా, ఈసారి వాటిని 3,843కి పెంచారు. అలాగే నీట్ పరీక్షలకు గతేడాది 560 కేంద్రాలు ఉండగా, ఈ సారి 660కి పెంచారు. ప్రతి షిష్ట్కు గతేడాది 1.32 లక్షల మంది పరీక్షలు రాయగా, ఈసారి 85 వేలకు తగ్గించారు. షిఫ్టుల సంఖ్యను 8 నుంచి 12కు పెంచారు.
99.4 కంటే అధిక ఉష్ణోగ్రత ఉన్న విద్యార్థులకు ఐసోలేషన్ గదులు
జెఇఇ మెయిన్, నీట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల శరీర ఉష్ణోగ్రత 99.4 ఫారిన్హీట్ డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే వారికి ప్రత్యేకంగా కేటాయించిన ఐసోలేషన్ గదుల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
ఐసోలేషన్ గదుల్లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయనున్నారు. ఇందుకోసం 15-20 నిమిషాల సమయం పట్టనుంది. ఆ లోపు వారి ఉష్ణోగ్రత తగ్గకపోతే ప్రత్యేక రూమ్లో వారికి పరీక్ష నిర్వహించనున్నారు.
విద్యార్థుల్లో అధిక శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి సెంటర్నే కేటాయించాలి.
విద్యార్థులు ముఖానికి మాస్క్లు, చేతికి గ్లౌజ్లు ధరించాలి.
వాటర్ బాటిల్, శానిటైజర్ కూడా వెంట తీసుకురావాలి.
పరీక్షా కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించాలి.
ఎగ్జామ్ సెంటర్లోకి కేవలం అడ్మిట్ కార్డుని మాత్రమే తీసుకురావాలి.
కేటాయించిన స్లాట్ల ప్రకారం పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలి.
పరీక్ష హాల్లోకి వెళ్లేముందు ప్రతి ఒక్కరు చేతులను శుభ్రపరచుకోవాలి.
పరీక్ష తరువాత ఒక్కొక్కరుగా బయటికి వెళ్లాలి.
పరీక్ష ముగిసిన వెంటనే మాస్క్, గ్లోవ్స్ని పరీక్ష సెంటర్ బయట ఉన్న చెత్తబుట్టలో పడేయాలి.