హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్తో
వచ్చే దుష్ప్రభావాలపై తాజా నివేదికలు వెల్లడి
వాషింగ్టన్ : కరోనా చికిత్సకు హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్ (ఎజెడ్ఎం)మాత్రలు రెండూ ఒకేసారి వాడితే ప్రమాదమా ? అన్న ప్రశ్న తలెత్తుతోంది. స్వల్పకాలిక కోర్సులో 30 రోజుల పాటు హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడితే ఎలాంటి ప్రమాదం ఉండదని దీర్ఘకాలికంగా వినియోగిస్తేనే హృద్రోగ సమస్యలు ఎదురౌతాయని తాజా నివేదికలు వెల్లడించాయి. అయితే హైడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్ రెండూ ఒకేసారి వినియోగిస్తే హృద్రోగ సమస్యలే కాదు ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు తప్పదని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎక్కువ కాలం వినియోగిస్తే సంభవించే దుష్ప్రభావాల గురించి యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈ ఎంఎ) గత ఏప్రిల్లో హెచ్చరించింది. అయితే తాజా పరిశోధన నివేదిక జర్నల్ లాన్సెట్ రూమటాలజీ మెడ్రిక్సైవ్లో వెలువడింది. కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ వైరస్ను నియంత్రిస్తుందని నిపుణులు అంచనా వేయడంతో దీని వాడకం బాగా పెరిగింది.
అయితే దీని ప్రభావంపై ఇంకా సమగ్రంగా పరిశోధనలు జరగలేదు. అయితే ఇప్పటివరకు ముఫ్పైరోజుల స్వల్పకాలిక వినియోగంతో ప్రమాదం ఉండదని బయటపడింది. అజిత్రోమైసిన్తో కలిపి దీర్ఘకాలికంగా వినియోగిస్తేనే ప్రమాదమని తాజా పరిశోధన హెచ్చరించింది. గత 20 ఏళ్లలో హెచ్సిక్యు వాడిన దాదాపు 9,50,000 మంది నుంచి వివరాలు సేకరించి సమీక్షించిన తరువాతనే ఈ పరిశోధన పత్రం తయారైంది. ఇందులో జర్మనీ, జపాన్, నెదర్లాండ్స్, స్పెయిన్, బ్రిటన్, అమెరికా దేశాలకు చెందిన సమాచారం మాత్రమే పరిగణ లోకి తీసుకున్నారు. అమెరికా అంటువ్యాధుల సొసైటీ కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్ను వినియోగించరాదని ఇటీవల హెచ్చరించింది. ఇది సరైన ఫలితాలు చూపించడం లేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ అనేక సార్లు తన అభిప్రాయాన్ని తెలియచేసింది.